Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్‌

పనితీరు మెరుగు పర్చుకొని అంచనాలను అందుకో లేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని గూగుల్‌ ఉద్యోగులను ఆ సంస్థ సీనియర్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌సైడర్‌ పత్రిక వార్తను

Published : 16 Aug 2022 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని గూగుల్‌ ఉద్యోగులను ఆ సంస్థ సీనియర్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌సైడర్‌ పత్రిక వార్తను ఉటంకిస్తూ న్యూయార్క్‌ పోస్టు పత్రిక కథనం వెలువరించింది. ఇప్పటికే గూగుల్‌ క్లౌడ్‌ సేల్స్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగుల పనితీరుపై మదింపు నిర్వహించనున్నట్లు కంపెనీ సీనియర్‌ నాయకత్వం పేర్కొంది. దీనిలో మొత్తంగా విక్రయాల్లో పురోగతి, సాధారణ పనితీరును అంచనావేయనున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని సేల్స్‌ టీమ్‌కు సందేశం వచ్చింది. 

మరోపక్క ఉద్యోగుల భయాలను మరింత పెంచేలా గూగుల్‌ నియామకాలను ఈ నెల కూడా నిలిపివేసింది. దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నెల మొదట్లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కొందరు ఉద్యోగుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్‌లో ఉత్పాదకత ఉండాల్సినంతగా లేదని ఆయన వివరించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గూగుల్‌ ఆదాయం ఆశించినంతగా లేదు. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చడానికి ‘సింప్లిసిటీ స్ప్రింట్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. లక్ష్యాలపై మరింత దృష్టిపెట్టేలా పనిసంస్కృతిని తయారు చేసుకోవాలని సుందర్‌ ఉద్యోగులకు సూచించారు. 2023 నాటికి నియామకాలు, పెట్టుబడులను కుదించి ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకత సాధిస్తామని పేర్కొన్నారు. 

టెక్‌ కంపెనీల్లో గూగుల్‌తో పాటు చాలా సంస్థలు నియామకాలను తగ్గించాయి. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా పనితీరు సరిగాలేని ఉద్యోగులను వదిలించుకొంటుందని  పేర్కొన్నారు. ట్విటర్‌ కూడా నియామకాలను నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ ఉద్యోగులకు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని