Google layoffs: భారత్‌లో 450 మందిని ఇంటికి పంపిన గూగుల్‌!

Google India layoffs: ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు ప్రకటించిన గూగుల్‌.. తాజాగా భారత్‌లో 450 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది.

Published : 17 Feb 2023 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) భారత్‌లో దాదాపు 453 మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (layoffs) గురువారం రాత్రి వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్‌ పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ ‘హిందూ బిజినెస్‌ లైన్‌’ తన కథనంలో పేర్కొంది.

మారిన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్‌ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం ఇచ్చామని, ఇతర దేశాల్లో వారికి త్వరలోనే సమాచారం అందుతుందని సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అప్పట్లో పేర్కొన్నారు. అయితే, గూగుల్‌ ప్రకటించిన ఈ భారీ లేఆఫ్‌ల ప్రక్రియలో భాగంగానే భారత్‌లో 453 మందిని తొలగించారా? దానికి అదనమా? అనేది స్పష్టత రాలేదు.

మరోవైపు గూగుల్‌ ఇండియా తొలగించిన వారిలో కొందరు లింక్డిన్‌ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్టులు పెడుతున్నారు. గూగుల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ లక్ష్యాలను చేరుకోవడంలో తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని, తాజా తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయానంటూ స్ట్రాటజిక్‌ కీ అకౌంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పోస్ట్‌ పెట్టారు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. గూగుల్‌ ఒక్కటే కాదు.. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా, ట్విటర్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఈ ఏడాది భారీగా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని