Google I/O 2023: పిక్సెల్‌ 7ఏ, ఫోల్డ్‌, ట్యాబ్లెట్‌.. గూగుల్‌ I/Oలో కీలక ప్రకటనలివే..

Google I/O 2023: గూగుల్‌ నుంచి పలు కొత్త అప్‌డేట్లు వచ్చాయి. ఏటా నిర్వహించే సమావేశంలో పలు కొత్త ఉత్పత్తులతో పాటు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన నూతన ఫీచర్లను గూగుల్‌ పరిచయం చేసింది.

Published : 11 May 2023 12:11 IST

Google I/O 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఏటా నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్‌ I/O 2023’ (Google I/O 2023) భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో పలు నూతన ఉత్పత్తులను, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను గూగుల్‌ ఆవిష్కరించింది. తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ పిక్సెల్‌ ఫోల్డ్‌ (Pixel Fold) సహా పిక్సెల్‌ 7ఏ (Pixel 7a) స్మార్ట్‌ఫోన్‌, పిక్సెల్‌ ట్యాబ్లెట్‌ (Pixel Tablet)ను పరిచయం చేసింది. సాఫ్ట్‌వేర్‌పరంగా చూస్తే ‘ఫైండ్‌ మై డివైజ్‌’, వాట్సాప్‌నకు వేర్‌ఓఎస్‌, అన్‌వాంటెడ్‌ ట్రాకర్‌ అలర్ట్‌ వంటి కొత్త అప్‌డేట్ల గురించి వివరించింది. అలాగే గూగుల్‌ సేవలకు రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ఎటువంటి సొబగులు అద్దనుందో తెలియజేసింది.

పిక్సెల్‌ ఫోల్డ్‌ ప్రత్యేకతలు..

గూగుల్‌ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘పిక్సెల్‌ ఫోల్డ్‌ (Pixel Fold)’. ఇది టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో వస్తోంది. 12 జీబీ ర్యామ్‌ 512 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్‌తో ఉన్న వేరియంట్‌ కూడా ఉంది. 4,821 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇస్తున్నారు. 48 ఎంపీ, 10.8 ఎంపీ, 10.8 ఎంపీతో కూడిన ట్రిపుల్‌ కెమెరా వెనుకభాగంలో ఉంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఔటర్‌ డిస్‌ప్లేపై 9.5 ఎంపీ కెమెరా ఉంది. ఇన్నర్‌ డిస్‌ప్లేలో 8 ఎంపీ కెమెరాను పొందుపర్చారు.

256 జీబీ వేరియంట్‌ ధర అమెరికా 1,799 డాలర్లు. భారత్‌లో దాదాపు ఇది రూ.1,47,500 వరకు ఉండొచ్చని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 512జీబీ వేరియంట్‌ ధర 1,919 డాలర్లు (దాదాపు రూ.1,57,300). ఈ ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. పిక్సెల్‌ ఫోల్డ్‌ (Pixel Fold)ను కొన్నవారికి గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ను ఉచితంగా అందించనుంది. అమెరికాలో ప్రీ-ఆర్డర్‌ సేల్‌ ప్రారంభమైంది.

పిక్సెల్‌ 7ఏ ఫోన్‌..

పిక్సెల్‌ 7ఏ (Pixel 7a) ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌తో వస్తోంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ధర రూ.43,999. లాంఛింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.4,000 వరకు తగ్గింపు లభించనుంది. దీంతో ధర రూ.39,999కు దిగిరానుంది. తెరపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. తొలిసారి పిక్సెల్‌ ఏ-సిరీస్‌ను 8జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చారు. 4,385 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. వెనక భాగంలో 64 ఎంపీ, 12 ఎంపీ కెమెరా ఉంది. ముందు భాగంలో 10.8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను ఇస్తున్నారు.

పిక్సెల్‌ ట్యాబ్లెట్‌..

గూగుల్‌ తమ తొలి ట్యాబ్లెట్‌ను కూడా పరిచయం చేసింది. పిక్సెల్‌ ట్యాబ్లెట్‌ (Pixel Tablet) పేరిట తీసుకొస్తున్న ఈ ట్యాబ్‌ సైతం టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌తో నడుస్తోంది. 11 అంగుళాల తెర అందుబాటులో ఉంది. 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వెనుక భాగంలో 8 ఎంపీ, ముందు భాగంలోనూ 8 ఎంపీ కెమెరా ఉంది. నాలుగు స్పీకర్లు ఉన్నాయి. దీని ధరను 499 డాలర్లుగా నిర్ణయించారు.

ఏఐపై ప్రధాన దృష్టి..

సెర్చింజన్‌కు మరింత అధునాతన కృత్రిమ మేధ (Artificial intelligence)తో కూడిన ఫీచర్లను జత చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. రానున్న రోజుల్లో గూగుల్‌ తమ సేవల్లో ఏఐని విస్తృతంగా ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. మరోవైపు చాట్‌జీపీటీ తరహా చాట్‌బాట్ బార్డ్‌ను అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇంగ్లిష్‌ సహా ఇతర భాషల్లోనూ బార్డ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మరోవైపు జీమెయిల్‌కు ‘హెల్ప్‌ మీ రైట్‌’, ‘మ్యాజిక్‌ ఎడిటర్‌’ వంటి ఏఐ ఫీచర్లను యాడ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

  • ఈమెయిళ్లు రాయడంలో ఉపయోగపడే ‘హెల్ప్‌ మీ రైట్‌’ అనే ఆప్షన్‌ను జీమెయిల్‌లో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
  • గూగుల్‌ మ్యాప్స్‌లో ఇమ్మర్సీవ్‌ రూట్లను చూపించడానికి ఇమ్మర్సీవ్‌ వ్యూ పేరిట ఏఐ ఫీచర్‌ను ఇవ్వనుంది. దీనిలో రోజు మొత్తానికి చెందిన వాతావరణ అప్‌డేట్లు కూడా ఉండనున్నాయి.
  • ఫొటోను ఎడిట్‌ చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మ్యాజిక్‌ ఎరేజర్‌కు మరింత అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను గూగుల్‌ తీసుకొస్తోంది. దీనికి మ్యాజిక్‌ ఎడిటర్‌గా నామకరణం చేసింది. మరికొన్ని నెలల్లో ఇది గూగుల్‌ ఫొటోస్‌లో అందుబాటులోకి రానుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని