ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌పై కేంద్రం నజర్‌.. తొలగించేలా నిబంధనలు?

Pre-Installed apps in Smart Phones: గూఢచర్యం, సమాచార తస్కరణ వంటి వాటిని అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉండే యాప్‌లను తొలగించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 

Updated : 14 Mar 2023 17:21 IST

దిల్లీ: స్మార్ట్‌ఫోన్ల ద్వారా గూఢచర్యం, వ్యక్తిగత సమాచార తస్కరణ ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంచుతున్న యాప్‌ల (pre-installed apps)ను తొలగించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ ‘రాయిటార్స్‌’ కథనాన్ని ప్రచురించింది.

ఇదే జరిగితే ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌ (pre-installed apps)ల ద్వారా లబ్ధిపొందుతున్న శాంసంగ్‌, రెడ్‌మీ, వివో, యాపిల్‌, షావోమీ వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల వ్యాపారం దెబ్బతిననుంది. ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంచుతున్న యాప్‌లే భద్రతాపరంగా ముప్పు తెచ్చిపెడుతున్నట్లు గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని చైనా వంటి విదేశాలు దుర్వినియోగపర్చి దేశ భద్రతకు భంగం కలిగించకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వ్యాపారాలపై భారత్‌ నిఘా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 300కు పైగా చైనా యాప్‌లను నిషేధించింది. అలాగే చైనా సంస్థలు భారత్‌లో చేస్తున్న పెట్టుబడులపైనా తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రపంచవ్యాప్తంగానూ వివిధ దేశాలు చైనా రూపొందించిన సాంకేతికతపై ఆంక్షలు విధిస్తున్నాయి. హువావే, హిక్‌విజన్‌ వంటి సంస్థల పరికరాలపై నిషేధం విధించాయి. ఎక్కడ వాటిని చైనా గూఢచర్యానికి వాడుకుంటుందోననే అనుమానంతోనే ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి.

ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లు ఉంటున్నాయి. వీటిని డిలీట్‌ చేయడానికి కుదరదు. ఉదాహరణకు షావోమీ యాప్‌ స్టోర్‌ గెట్‌యాప్స్‌, శాంసంగ్‌ పేమెంట్‌ యాప్‌ శాంసంగ్‌ పే, ఐఫోన్‌లో సఫారీ బ్రౌజర్‌.. వీటిని ఫోన్‌ నుంచి తొలగించడం సాధ్యం కాదు. కొత్తగా రూపొందిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆయా కంపెనీలు తమ ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను తొలగించే ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్ని కంపెనీలు పాటిస్తున్నాయో, లేదో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ చూస్తుంది. మరోవైపు ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఇచ్చే ప్రతి అప్‌డేట్‌కు ముందస్తు తనిఖీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లకు అప్‌డేట్‌ను అందించే ముందే ఈ తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని