Nirmala Sitharaman: ద్రవ్యోల్బణం అదుపు చేస్తాం: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman Inflation: ద్రవ్యోల్బణాన్ని మరింత అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిజేశారు.

Published : 14 Dec 2022 19:43 IST

దిల్లీ: ద్రవ్యోల్బణాన్ని (Inflation) మరింత అదుపు చేసేందుకు మరిన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ (RBI) నిర్దేశించుకున్న లక్షిత స్థాయి దిగువకు చేరిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు వ్యయంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.

పేదల ప్రయోజనం కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత అదుపు చేసేందుకు చర్యలు చేపట్టనున్నామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గమనిస్తూనే ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని తెలిపారు. దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాన్ని (6.4 శాతం) చేరుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

నిరర్థక ఆస్తుల గురించి మాట్లాడుతూ.. 2022 మార్చి నాటికి ఎన్నడూ లేని విధంగా 7.28 శాతానికి మొండి బకాయిలు (NPA) తగ్గాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు దోహదం చేశాయని చెప్పారు. అలాగే, అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గినప్పటికీ.. ఇతర దేశాల కరెన్సీ కంటే మెరుగ్గా రాణిస్తోందన్నారు. భారత్‌లో భారీ స్థాయిలో విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్‌ చెప్పిందని గుర్తుచేశారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.3.25 లక్షల కోట్లు ప్రభుత్వం అదనపు వ్యయం చేసేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

అంతకుముందు దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుపై.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం విమర్శలు గుప్పించారు.  దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ మోదీ ప్రభుత్వాన్ని నిందించారు. నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని