Adani group: అదానీ స్టాక్స్‌లో 10 శాతానికి జీక్యూజీ వాటా

Adani group- GQG: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో జీక్యూజీ తన వాటాను క్రమంగా పెంచుకుంటోంది. మున్ముందు మరింత పెంచుకోనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.

Published : 23 May 2023 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ (Adani group) అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ వాటా మరింత పెరిగింది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన అనంతరం రుణాల తిరిగి చెల్లింపుల కోసం ఇదే జీక్యూజీ.. వాటాల కొనుగోలు చేసి ఓ విధంగా అదానీ గ్రూప్‌ సంస్థ ఆదుకుంది. ఇప్పుడు ఆ సంస్థ తన వాటాలను 10 శాతానికి పెంచుకుంది. భవిష్యత్‌లోనూ అదానీ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేస్తామని ఆ సంస్థ అధినేత రాజీవ్‌ జైన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రాబోయే ఐదేళ్లలో అదానీ కుటుంబం తర్వాత అదానీ గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుగా కావాలనుకుంటున్నట్లు జైన్‌ వివరించారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ కంపెనీల్లో జీక్యూజీ పెట్టుబడుల విలువ 3.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌లో మంచి మౌలిక సదుపాయాల సంపద ఉందని చెప్పారు. అయితే, ఏ కంపెనీలో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టిందీ మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా మల్టీబ్యాగర్‌ రిటర్న్స్ రానున్నాయని చెప్పారు.

జీక్యూజీ పార్టనర్స్‌కు అదానీ గ్రూప్‌ నాలుగు నమోదిత సంస్థల్లో మైనారిటీ వాటాలను ఈ ఏడాది మార్చిలో రూ.15,446 కోట్లకు విక్రయించింది. సెకండరీ మార్కెట్‌ బ్లాక్‌ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో ఈ వాటాలను అదానీ గ్రూప్‌ విక్రయించింది. మరోవైపు అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్ల ర్యాలీ మంగళవారం సైతం కొనసాగింది. సుప్రీం కోర్టు కమిటీ సమర్పించిన నివేదికను ఊరటగా భావిస్తున్న నేపథ్యంలో మదుపర్లు ఈ స్టాక్స్‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఈరోజు 13.49 శాతం పెరిగి రూ.2,639.95 దగ్గర స్థిరపడింది. ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని