GST: జీఎస్‌టీ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వీటికి మినహాయింపు లేనట్లే!

GST (వస్తు సేవల పన్ను) కౌన్సిల్‌ రెండు రోజుల సమావేశంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

Updated : 28 Jun 2022 20:13 IST

చండీగఢ్‌: GST (వస్తు సేవల పన్ను) కౌన్సిల్‌ రెండు రోజుల సమావేశంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇస్తున్న మినహాయింపులను ఉపసంహరించుకుంది. రోజుకు రూ.1000లోపు ఛార్జ్‌ చేసే హోటల్‌ వసతిని పన్ను పరిధిలోకి తెచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత జరుగుతున్న ఈ జీఎస్‌టీ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఆర్థిక మంత్రులు హాజరై పలు ప్రతిపాదలను కౌన్సిల్‌ ముందుంచారు. ఇందులో భాగంగా రూ.1000లోపు లభించే హోటల్‌ రూమ్‌ అద్దెపై ఇప్పటివరకూ ఎలాంటి జీఎస్‌టీ వసూలు చేయటం లేదు. ఈ మినహాయింపు పక్కదారి పడుతుండటంతో దాన్ని రద్దు చేసి, ఇక నుంచి 12శాతం జీఎస్‌టీని వసూలు చేస్తారు. అదే విధంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5వేల కన్నా ఎక్కువ ధర కలిగిన గదిపై 5శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.(ఐసీయూలకు మినహాయింపు)

పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ లెటర్స్‌, బుక్‌పోస్ట్‌, ఎన్వలప్‌(పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్‌ సేవలపైనా జీఎస్‌టీ వసూలు చేయనున్నారు. చెక్స్‌పై(విడిగా లేదా పుస్తకంగా ఉన్నా సరే) 18శాతం జీఎస్‌టీ వసూలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలపై, ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణంపై ఇస్తున్న రాయితీని కూడా ఉపసంహరించుకుంది. అలాగే వ్యాపార సంబంధమైన జంతువధశాలలకు ఇస్తున్న మినహాయింపు కూడా తొలగించారు. దీంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా పొగ వేయటం, గోడౌన్‌లలో గింజలు, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పూర్తిగా తయారు కాని పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చారు. ఇక తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలపైనా సేవా పన్ను మినహాయించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ సూచించింది. దీంతో పాటు, పెట్రోలియం, బొగ్గు ఆధారిత వస్తువులు, పరికరాలపై 12శాతం పన్ను వసూలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు