చార్టర్డ్‌ విమానాల చక్కర్లు

ప్రైవేటు చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటానికి తోడు కొవిడ్‌ నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి కుబేరులు వీటిని బుక్‌ చేసుకుంటున్నారని చెబుతున్నారు.........

Published : 28 Mar 2021 13:52 IST

ఎన్నికలకు తోడు కొవిడ్‌ నేపథ్యం

దిల్లీ/పుణె: ప్రైవేటు చార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటానికి తోడు కొవిడ్‌ నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి కుబేరులు వీటిని బుక్‌ చేసుకుంటున్నారని చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది చార్టర్డ్‌ విమానాల బుకింగ్‌లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌కు ముందు కూడా చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించిన వారు కొందరైతే.. ఇదివరకు బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించిన అత్యధిక సంపన్నుల్లోని కొందరు కొవిడ్‌ భయంతో ఇప్పుడు ప్రైవేటు చార్టర్డ్‌ విమానం బుక్‌ చేసుకుని వెళ్తున్నారని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులైన స్నేహితులు కలిసి వెళ్లేందుకు ఇలా విమానం బుక్‌ చేసుకుంటున్నారని క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సంస్థ తెలిపింది. ఒక్కో విమానం కొవిడ్‌ ముందు నెలలో 40-50 గంటల పాటు నడిచేదని, ఇప్పుడు కూడా మళ్లీ ఆ స్థాయిలో కార్యకలాపాలు నడుస్తున్నాయని పేర్కొంది.

*ఎన్నికల ప్రచారానికి అనువుగా హెలికాప్టర్లను రాజకీయ పార్టీలు బుక్‌ చేసుకుంటున్నాయి. సాధారణంగా ఓఎన్‌జీసీ, రాష్ట్ర ప్రభుత్వాలు, మతపరమైన పర్యటనలకు హెలికాప్టర్లు ఎక్కువగా బుక్‌ అవుతుంటాయని 12 హెలికాప్టర్లను నిర్వహిస్తున్న గ్లోబల్‌ వెక్ట్రా హెలికాప్టర్స్‌ తెలిపింది. ఇప్పుడు మాత్రం అన్ని హెలికాప్లర్లు ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లినట్లు పేర్కొంది.

*విమానాలను లీజుకు ఇచ్చే సంస్థల నుంచి రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న మధ్యవర్తులు తీసుకుంటుంటారు. తదుపరి వారు ఆయా పార్టీల అవసరాల మేరకు పంపుతుంటారు.

పర్యాటక సీజన్‌ మే-అక్టోబరు 
సాధారణంగా వేసవిలో పర్యటనలు ఎక్కువగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రైవేటు విమానాల బుకింగ్‌ మే నెలలో ప్రారంభమై, అక్టోబరు వరకు కూడా కొనసాగుతుంటుంది. ఇక వ్యాపార అవసరాల నిమిత్తం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం పర్యటనలకు వెళ్లే సంపన్నులు కూడా వీటిని తీసుకుంటుంటారు. కొవిడ్‌ వల్ల దీర్ఘకాలం పాటు ఎటూ కదలని కుబేరులు, టీకా వేయించుకోవడంతో, సేదతీరేందుకు తమకు కావాల్సిన ప్రాంతాలకు వెళ్లేందుకు చార్టర్డ్‌ విమానాలు/హెలికాప్టర్లు బుక్‌ చేసుకుంటున్నారు. వ్యాపార అవసరాల కంటే ఈ విధమైన ప్రయాణాలకే అధికంగా బుక్‌ అవుతున్నాయని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ పేర్కొంది. 

 

ఈ ప్రాంతాల మధ్య ఎక్కువగా..
హైదరాబాద్‌-దిల్లీ                   
హైదరాబాద్‌-ముంబయి 
విజయవాడ-దిల్లీ 
ముంబయి-దిల్లీ 
కోల్‌కతా-అహ్మదాబాద్‌ 
ముంబయి-కోల్‌కతా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని