కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో ఇంటి రుణాలు

వివిధ వ‌డ్డీ రేట్లు ఆధారంగా చేసుకుని కేంద్రం త‌మ‌ ఉద్యోగుల‌కు ఈ రుణ వ‌డ్డీ రేటును నిర్ణ‌యిస్తుంది

Updated : 16 Apr 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి నిర్మాణానికి నిధులు స‌మ‌కూర్చ‌డానికి ‘హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్’ (హెచ్‌బీఏ) స‌రికొత్త వ‌డ్డీ రేటును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఇంత‌కు ముందు కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుతో ఇంటి రుణాన్ని పొందొచ్చు. ఈ రుణం ద్వారా త‌మ సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌చ్చు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఈ త‌గ్గిన వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది. బ్యాంకులు అందించే ఇంటి రుణాల వ‌డ్డీ రేట్ల‌ను, మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ వ‌డ్డీ రేట్లు ఆధారంగా చేసుకుని కేంద్రం త‌మ‌ ఉద్యోగుల‌కు ఈ రుణ వ‌డ్డీ రేటును నిర్ణ‌యిస్తుంది.

కేంద్ర గృహ‌నిర్మాణ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వ‌ర‌కు ల‌భించే ఇంటి రుణాల కోసం 7.10 శాతంగా వ‌డ్డీ రేటును నిర్ణ‌యించింది. ఇంత‌కు ముందు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి  ఈ వ‌డ్డీ  రేటు అక్టోబ‌ర్ 1, 2020 నుంచి మార్చి 31, 2022 వ‌ర‌కు అంటే 18 నెల‌ల‌కు 7.90 శాతంగా నిర్ణ‌యించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి 34 నెల‌ల ప్రాథ‌మిక వేత‌నం, గరిష్ఠంగా రూ. 25 ల‌క్ష‌లు లేదా ఇంటి ఖ‌రీదు లేదా తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం ప్ర‌కారం మొత్తం, కొత్త‌గా ఇంటి నిర్మాణం, ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు కోసం ఏది త‌క్కువైతే అది ప‌రిగ‌ణిస్తారు.

‘హెచ్‌బీఏ’ నిబంధ‌న‌ల ప్ర‌కారం తీసుకున్న రుణ మొత్త‌మైన‌ అస‌లును మొద‌టి 15 ఏళ్ల‌లో అంటే 180 నెల‌స‌రి వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. వ‌డ్డీని 60 నెల‌వారీ వాయిదాల‌లో చెల్లించాలి. కేంద్ర ప్ర‌భుత్వ శాశ్వ‌త ఉద్యోగి, 5 సంవ‌త్స‌రాలు నిరంత‌ర పనిచేసిన వారు క‌లిగి ఉన్న తాత్కాలిక ఉద్యోగులంద‌రూ కూడా ‘హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్’ పొందొచ్చు. ఉద్యోగి ప‌నిచేసే చోటే ఇంటి నిర్మాణం చేప‌ట్ట‌న‌క్క‌ర్లేదు. ఉద్యోగి సొంత ఊరిలో, భ‌విష్య‌త్తులో నివాస‌ముండే ప్రాంతంలో కూడా ఈ రుణంతో ఇంటి నిర్మాణం చేప‌ట్ట‌వ‌చ్చు. ఇంటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని