Q-A: 15 ఏళ్ళలో రూ.5 కోట్లు సమకూర్చుకోవచ్చా?

మీ ఆర్ధిక లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఎంచుకోవడం మేలు.

Published : 27 Jan 2023 16:29 IST

* నేను నెలకు రూ.10,000 మదుపు చేయగలను. 15 ఏళ్ళలో రూ. 5 కోట్లు సమకూర్చుకోవాలంటే నా పెట్టుబడులపై ఎంత రాబడి రావాలి?

- రాజేందర్

* అధిక రాబడి కావాలంటే రిస్క్ ఉన్న పధకాలు ఎంచుకోవాలి. నెల నెలా రూ. 10 వేలు మదుపు చేస్తే, 15 ఏళ్ళకి సుమారుగా 12 శాతం వార్షిక రాబడి అంచనాతో మీరు రూ. 50 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. అదే 15 శాతం రాబడి అంచనాతో, సుమారుగా రూ. 68 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. 15 ఏళ్ళకి 12 శాతం రాబడితో  రూ. 5 కోట్లు పొందాలంటే నెల నెలా రూ.1 లక్ష వరకు మదుపు చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాల్లో ఇంతకంటే ఎక్కువ రాబడి పొందగలరు అని మీరు వినుండవచ్చు, అయితే వాటిల్లో మీరు పెట్టిన పెట్టుబడి పోగొట్టుకునే రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. మీ ఆర్ధిక లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఎంచుకోవడం మేలు.


* హాయ్, నేను నా 24వ ఏట నుంచి జీవన్ సరళ్ పాలసీలో 10 ఏళ్లుగా రూ. 30 వేల వార్షిక ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పుడు పాలసీ సరెండర్ చేసి కొన్ని అప్పులు తీర్చాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?

- కృష్ణప్రియ

* మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. పాలసీ సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియంలో కొంత మొత్తం కోల్పోవచ్చు. ఇది పాలసీ కాలపరిమితి, హామీ మొత్తం, ప్రీమియంని బట్టి మారుతుంటుంది. మీరు ఎల్ఐసిని సంప్రదించి పాలసీ సరెండర్ చేయడం మేలు.

జీవిత బీమా కావాలంటే ఒక టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌(పదవీ విరమణ నిధి కోసం) లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో కొంత రిస్క్ తీసుకోగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్  డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.    


* హాయ్. నా ఉద్యోగ సంస్థ ప్రతి నెలా నా జీతం నుంచి కొంత మొత్తాన్ని పన్ను రూపంలో కట్ చేస్తూ ఉంటుంది. అయితే, ఇది వారు ప్రభుత్వానికి జమ చేస్తున్నారా లేదా తెలుసుకోవడం ఎలా?

- ఖాదర్ బాషా

* ఉద్యోగ సంస్థ ప్రతి నెలా ఉద్యోగస్తుల జీతం నుంచి పన్ను తీసి వేసి ఆదాయపన్ను శాఖ వారి వద్ద జమ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఆదాయ పన్ను వెబ్సైటులో లాగిన్ చేసాక ఫారం 26AS ద్వారా సరి చూసుకోవచ్చు. ఒకవేళ మీ డబ్బు ఆదాయ శాఖ వారికి అందకపోతే మీరు నేరుగా వారికి ఫిర్యాదు కూడా చేయవచ్చు. 

మీరు ఏదైనా ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించి పత్రాలు అందించలేకపోతే ఈ మినహాయింపులను ఆదాయ పన్ను రిటర్న్స్ సమయంలో తెలిపి ఆ మేరకు మొత్తాన్ని రీఫండ్ కూడా పొందే అవకాశం ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు