నెల‌కు రూ.3000 మ‌దుపు చేస్తూ రూ. 3కోట్లు కూడ‌బెట్టడం సాధ్య‌మేనా?

మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Updated : 16 May 2022 17:11 IST

 
వృత్తి, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా చేసే ప‌ని ఏదైనా, వ‌య‌సు పైబ‌డిన త‌ర్వాత బాధ్య‌త‌ల నుంచి విశ్రాంతి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇందుకోస‌మే ప‌ద‌వీవిర‌మ‌ణ. భార‌త‌దేశంలో పదవీ విరమణ వయసు సాధారణంగా 60 సంవత్సరాలు. ఈ వయసును దృష్టిలో పెట్టుకునే చాలామంది పదవీ విరమణ కోసం ప్రణాళిక చేస్తుంటారు. అయితే కొంద‌రు ఈ వ‌య‌సు కంటే ముందే రిటైర్‌మెంట్ తీసుకోవాల‌ని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆలోచ‌న ఉన్న‌వారు పెట్టుబడులను కూడా వీలైనంత త్వరగానే ప్రారంభించాలి. అంటే కనీసం 25 సంవత్సరాల వయసులో పెట్టుబడులను ప్రారంభించాల్సి ఉంటుంది.

ఉద్యోగంలో చేరిన కొత్త‌లో పెట్టుబ‌డులు చేసేందుకు మ‌న వ‌ద్ద అధిక మొత్తంలో డ‌బ్బు ఉండ‌దు. అలాగ‌ని మ‌దుపు చేయ‌డం మానేస్తే స‌రైన స‌మ‌యానికి ల‌క్ష్యాన్ని చేరుకోలేము. అందుకే ప్ర‌తీ నెలా మ‌న‌కు వీలైనంత డ‌బ్బును ఆదా చేయాలి. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్ ) ద్వారా పెట్టుబడులు చేయ‌వ‌చ్చు.  నెలవారీగా చిన్న మొత్తాలతో ఎక్కువ మొత్తాన్ని కూడబెట్టడంలో ఈ విధానం సహాయపడుతుంది. అయితే ఇందులో పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగించాలి. 

మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే కేవలం సిప్ చేయడం ద్వారా మాత్రమే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని చేరుకోలేరు. ప్రతీ సంవత్సరం పెట్టుబడులను పెంచుతుండాలి. ఒక వ్యక్తి పెట్టుబడిలో వార్షిక స్టెప్-అప్ 10 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం వ్యక్తి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దీంతోపాటే పెట్టుబడులను పెంచే ఆలోచన చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడులలో నెలవారి సిప్, వార్షిక స్టెప్-అప్‌లు మదుపర్ల పెట్టుబడులపై గరిష్ఠ కాంపౌండింగ్ ప్రయోజనాన్ని అందిస్తాయి.

మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం, ఒక వ్యక్తి నెల‌కు రూ. 3000 మ‌దుపు చేస్తూ, 5 శాతం వార్షిక స్టెప్ - అప్‌తో, 12 శాతం రాబ‌డి అంచ‌నాతో 35 సంవ‌త్స‌రాల‌లో దాదాపు రూ. 3 కోట్లు కూడ‌బెట్ట‌గ‌ల‌డు. అదే 12 శాతం వార్షిక స్టెప్-అప్‌తో మ‌దుపు చేయ‌గ‌లిగితే, 12 శాతం రాబ‌డి అంచ‌నాతో 30 ఏళ్ల‌లోనే ఈ మొత్తాన్ని సేక‌రించ‌గ‌లుగుతాడు. ఇక్కడ అతను/ఆమె 30 ఏళ్ల‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు ₹ 87 ల‌క్ష‌లు, మొత్తం రాబడి ₹2.50 కోట్లు, మెచ్యూరిటీ మొత్తం ₹3.37 కోట్లు.  

చివ‌రిగా..
సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబ‌డులు చేసే వారికి ముఖ్యంగా ఉండాల్సింది ఆర్థిక క్రమశిక్షణ, స‌రైన ప్ర‌ణాళిక‌. ఈ రెండు ఉంటే పెద్ద ల‌క్ష్యాన్ని అయినా సుల‌భంగా సాధించ‌వ‌చ్చు. ప్రారంభంలో చిన్న మొత్తాల‌తో ప్రారంభించినా, ఆదాయం పెరిగే కొద్ది పెట్టుబ‌డులు పెంచుతూ పోతే అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే ల‌క్ష్యాన్ని చేరుకోవచ్చు. 

(గ‌మ‌నిక: మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు మార్కెట్ రిస్క్‌ల‌కు లోబ‌డి ఉంటాయి. పెట్టుబ‌డులు పూర్తిగా మీ వ్య‌క్తిగ‌త విష‌యం. పైన తెలిపిన స‌మాచారం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని