Unclaimed deposits: ఆ జాబితాలో మీ పేరుందా? తెలుసుకోండి ఇలా...

బ్యాంకు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో డబ్బు దాచి మర్చిపోయినవారెందరో. ఈ మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల వరకూ ఉందని ఆర్‌బీఐ లెక్క తేల్చింది.

Updated : 12 May 2023 15:25 IST

బ్యాంకు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో డబ్బు దాచి మర్చిపోయినవారెందరో. ఈ మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల వరకూ ఉందని ఆర్‌బీఐ లెక్క తేల్చింది. పదేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలూ నిర్వహించని ఖాతాల్లో ఉన్న మొత్తం ఇది. ఈ డబ్బును బ్యాంకులు రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి. మరి ఈ మొత్తంలో మీ డబ్బూ ఉందా? ఉంటే ఏం చేయాలి?  తెలుసుకుందాం.

క్లెయిం చేయని మొత్తాలను సంబంధిత వ్యక్తులకు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విధివిధానాలను సిద్ధం చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి సూచనలు జారీ చేశారు. బ్యాంకింగ్‌ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు ఇలా ప్రతి పెట్టుబడి పథకంలోనూ క్లెయిం చేయకుండా ఉన్న మొత్తం ఉంది. ఈ సంఖ్య పెరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఉన్న ఎవరి డబ్బైనా ఉందా అని తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు బ్యాంకులు ఇప్పటికే ‘అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌’లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. బ్యాంకు వెబ్‌సైటులో ఇందుకోసం ప్రత్యేక లింక్‌ను ఇస్తున్నాయి.

  • మీకు డిపాజిట్‌ లేదా పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు అధీకృత వెబ్‌సైటుకు వెళ్లి, అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల లింక్‌పై క్లిక్‌ చేయండి. సెర్చ్‌ఇంజిన్‌లోనూ దీన్ని వెతికి పట్టుకోవచ్చు.
  • కొన్ని బ్యాంకులు పేరు, పుట్టిన తేదీ వివరాలతో క్లెయిం చేసుకోని ఖాతాదారుల వివరాలను తెలియజేస్తున్నాయి.
  • మరికొన్ని అదనంగా పాన్‌ లేదా ఇతర గుర్తింపు వివరాలూ కోరుతున్నాయి. అప్పుడు పేరు, చిరునామా వివరాలు కనిపిస్తాయి. అవి మీవే అని అనిపిస్తే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.
  • సొంతంగా క్లెయిం చేసుకునే వారు.. ఒక దరఖాస్తు పత్రంతోపాటు, గుర్తింపు ధ్రువీకరణలను జత చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాను ఆపరేటివ్‌గా మారుస్తారు.
  • ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే.. నామినీ/వారసులు బ్యాంకును సంప్రదించి, అడిగిన వివరాలు అందించాలి. అప్పుడు బ్యాంకు నిబంధనల మేరకు ఆ డబ్బును నామినీ/వారసులకు బదిలీ చేస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని