Pension: నెలకు ₹12 వేలతో ₹2లక్షల వరకు పెన్షన్‌..!

ఈక్విటి, డెట్‌ కలయికతో ఎన్‌పీఎస్‌ నుంచి దీర్ఘకాలంలో వార్షికంగా దాదాపు 10% రాబడి ఆశించవచ్చు.

Updated : 10 Dec 2022 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) ప్రభుత్వ మద్దతు గల సామాజిక భద్రతా పథకం. మదుపర్లు ఈ పథకం ద్వారా ఒకేసారి ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాదారుడు 75% వరకు పెట్టుబడులను ఈక్విటీల్లో పెట్టబడి పెట్టే వీలుంది. మిగిలిన 25% శాతం మాత్రం డెట్‌లో ఉంచాలి. అయితే ఈక్విటీ, డెట్‌ పెట్టుబడులను 60:40 నిష్పత్తిలో, 50:50 నిష్పత్తిలో గానీ దీర్ఘకాలంలో ఉంచడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందొచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈక్విటీ, డెట్‌ కలయికతో ఎన్‌పీఎస్‌ నుంచి దీర్ఘకాలంలో వార్షికంగా దాదాపు 10% రాబడి ఆశించవచ్చు. అలాగే ఎన్‌పీఎస్‌ (NPS) పెట్టుబడులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.

10% రాబడి ఎలా?

ఎన్‌పీఎస్‌ (NPS) పెట్టుబడులపై ఈక్విటీల నుంచి దీర్ఘకాలంలో దాదాపు 12%, డెట్‌ నుంచి కనీసం 8% రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మదుపరి 50:50 రేషియో ఎంచుకుంటే, ఈక్విటీ నుంచి 6%, డెట్‌ నుంచి 4% మొత్తంగా నికర ఎన్‌పీఎస్‌ రాబడి 10% అవుతుంది.

ఒకవేళ మదుపరి 60:40 నిష్పత్తిలో ఎంచుకుంటే ఈక్విటీ రాబడి 7.20% (12x0.60), డెట్‌ నుంచి దాదాపు 3.20% (8x0.40) మొత్తం 10.40 ( 7.20+3.20) అంటే దాదాపు 10% రాబడి వస్తుంది. 

నెలకు రూ.12 వేలతో ఎంత నిధి సమకూర్చుకోవచ్చు?

పెట్టుబడిదారుడు ప్రస్తుత వయసు 30 ఏళ్లు మరో 30 ఏళ్లలో అంటే 60 ఏళ్ల వయసులో రిటైర్‌ అవుతారనుకుంటే పెట్టుబడులకు 30 ఏళ్లు దీర్ఘకాల సమయం ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడిదారుడు 60:40 నిష్పత్తి ప్రకారం ఈక్విటీ, డెట్‌లో నెలకు రూ.12 వేల చొప్పున పెట్టుబడులు పెడితే 10% రాబడి అంచనాతో రూ. 2,71,25,855 కోట్ల నిధిని సమకూర్చుకోవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం రూ. 43,20,000. వడ్డీ రూ.2,28,05,855.

యాన్యుటీ కోసం..

పదవీ విరమణ సమయానికి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, సమకూరిన మొత్తం నుంచి 60% నిధిని మాత్రమే ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగిలిన 40% తప్పనిసరిగా యాన్యుటీ కోసం కేటాయించాలి. అంటే పైన సమకూరిన మొత్తంలో 40% ( రూ.1,08,50,342) యాన్యుటీలకు కేటాయించాలి. ఈ మొత్తం నుంచి 8% రాబడి అంచనాతో నెలకు దాదాపు రూ.72 వేల వరకు పెన్షన్‌ పొందొచ్చు. 

60% మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా పెట్టుబడి పెడితే..

పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల నుంచి క్రమంగా ఆదాయం కావాలనుకుంటున్నవారు సిస్టమేటిక్‌ విత్‌డ్రాయిల్‌ ప్లాన్‌ (SWP) ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీని ద్వారా నెల నెలా అవసరమయ్యే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై రాబడిని పొందొచ్చు. ఎన్‌పీఎస్‌లో విత్‌డ్రా చేసుకున్న 60% మొత్తాన్ని (రూ.1,62,75,513) మ్యూచువల్‌ ఫండ్‌ డెట్‌ పథకాల్లో ఎస్‌డబ్ల్యూపీ (SWP) విధానం ద్వారా పెట్టుబడులను పెడితే 8-9% రాబడి అంచనాతో తర్వాతి 25 ఏళ్లు నెలకు సుమారుగా రూ.1,28,000 ఆదాయం పొందొచ్చు. దీంతో పదవీవిరమణ తర్వాత దాదాపు రూ. 2 లక్షల (రూ. 72,000+రూ.1,28,000) నెలవారీ ఆదాయం పొందొచ్చు.

చివరిగా..

మ్యూచువల్‌ ఫండ్లలో కొంత నష్టభయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువ మంది రిస్క్‌ తీసుకోలేరు. అటువంటప్పుడు రిస్క్‌లేని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీం, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని