పన్ను ప్రణాళిక పూర్తయిందా?

మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆర్జించిన ఆదాయానికి ఎంత పన్ను చెల్లించాలన్న విషయంలో ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చి ఉంటుంది.

Updated : 10 Mar 2023 03:20 IST

మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆర్జించిన ఆదాయానికి ఎంత పన్ను చెల్లించాలన్న విషయంలో ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చి ఉంటుంది. పెట్టుబడులూ పూర్తయ్యే ఉంటాయి. కొంతమంది చివరి నిమిషం వరకూ ఏ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తుంటారు. ఫలితంగా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పథకాల ఎంపికలో కొన్ని పొరపాట్లూ దొర్లుతాయి. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు కోసం మదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

ఎంత పన్ను చెల్లించాలి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. 2022-23 ఆర్థిక సంవత్సరం (2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌)కు సంబంధించి మీరు ఎంత పన్ను చెల్లించాలన్నది చూసుకోండి. మీ మొత్తం ఆదాయం, పన్ను శ్లాబు తెలుసుకోండి. వేతనం, వ్యాపారం, డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా వచ్చిన స్వల్ప, దీర్ఘకాలిక లాభాలు, బహుమతులు ఇలా అన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించాలి. ఆదాయపు పన్ను శాఖ వద్ద వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో మీ ఆదాయం, అధిక విలువగల లావాదేవీలన్నీ ఉంటాయి. మీ కార్యాలయం అకౌంట్స్‌ విభాగంతో మాట్లాడి, మీరు ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆదా చేసుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి తెలుసుకోండి. ఇప్పటికే టీడీఎస్‌ రూపంలో కొంత చెల్లించి ఉంటారు. కాబట్టి, మార్చి నెలలో ఇంకా ఎంత పన్ను కోత ఉంటుందో చూసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి కోసం ఏ పథకాలు ఎంపిక చేసుకోవాలన్నది నిర్ణయించుకోవచ్చు. గృహరుణంపై చెల్లించే వడ్డీ, ఈపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియాలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు తదితరాలన్నీ లెక్కించిన సెక్షన్‌ 80సీ పరిమితి చేరుకునేందుకు ఎంత మదుపు చేయాలన్నది చూసుకోవాలి.

అవసరం లేకుండా వద్దు..

పన్ను ఆదా చేయడానికి అనేక మార్గాలున్నాయి. వీటిలో ఏవి ఎంచుకోవాలన్నది మీ అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అవసరం లేకున్నా అధిక ప్రీమియం ఉండే బీమా పాలసీలను తీసుకోవద్దు. పన్ను ఆదా బీమా పాలసీలు కల్పించే ఒక ప్రయోజనం. పూర్తిగా బీమా పాలసీలతోనే పన్ను మినహాయింపు పొందాలని అనుకుంటే ఇతర ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. ఖరీదైన పాలసీలు కాకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. ప్రీమియం అధికంగా ఉండే పాలసీలను తీసుకొని, ఆ తర్వాత ఏడాది ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు పడటం ఎట్టి పరిస్థితులోనూ ఆచరణీయం కాదు.

తక్కువ వ్యవధితో..

పన్ను ఆదా పథకాల్లో తప్పనిసరి లాకిన్‌ వ్యవధి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లు అందించే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలి. బ్యాంకులో పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినప్పుడు అయిదేళ్లు వెనక్కి తీసుకోలేం. బీమా పాలసీలకూ నిర్ణీత వ్యవధి ఉంటుంది. కాబట్టి, వ్యవధి గురించి అవగాహన లేకుండా పన్ను ఆదా పథకాలను ఎంచుకుంటే.. తర్వాత వెనక్కి తీసుకోవాలన్నా కుదరదు.

రాబడి అంచనా కీలకం..

పన్ను ఆదా పథకాల్లో రాబడి ఎంత వస్తుంది అన్నదీ కీలకమే. సురక్షిత పథకాల్లో పొదుపు చేసినప్పుడు రాబడి హామీ ఉంటుంది. మార్కెట్‌ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు రాబడిపై కచ్చితమైన అంచనాలుండవు. కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు 10-15 శాతం వరకూ రాబడినిస్తున్నాయి. కొన్ని పథకాల్లో మదుపు చేసినప్పుడు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, వచ్చిన రాబడి/వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. కాబట్టి, పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు ఈ అంశాన్నీ గుర్తుంచుకోవాలి.

పొదుపు సరిపోదు..

సురక్షితంగా ఉండే పొదుపు పథకాల్లో మాత్రమే మదుపు చేస్తాం... అంటే పన్ను ఆదా అవుతుంది కానీ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూర్చుకోలేం. కాబట్టి, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోండి. మంచి పొదుపు-పెట్టుబడి పథకాల మిశ్రమంగా మీ జాబితా ఉండాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. చివరగా ఒక మాట.. పథకం ఏదైనా సరే. దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఎంచుకోవద్దు. మీకు స్పష్టత వచ్చాకే పెట్టుబడి నిర్ణయం తీసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని