Cyber crimes: మీ ఖాతాలో డబ్బు ఖాళీ కాకుడాదంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
బ్యాంకులు, లేదా ఇతర ఆర్థిక సంస్థలు పాస్వర్డ్, ఏటీఎమ్ పిన్, క్రెడిట్ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కోసం కాల్ చేయవు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు చేసే వారి సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఆన్లైన్ ద్వారా ఉన్న చోట నుంచే చెల్లింపులు చేయగలుగుతున్నాం. అలాగే షాపింగ్, చిరుతిళ్లు వంటి వాటి కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ పర్సులో నగదు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కార్డు లేదా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నాం. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న వ్యాపారులు కూడా వారి దుకాణాల వద్ద క్యూఆర్ స్కానింగ్ను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఇబ్బంది పడకుండా చెల్లింపులు చేసేస్తున్నాం. అలాగే బ్యాంకు ద్వారా చేయాల్సిన నగదు బదిలీలు, రుణ దరఖాస్తులు కూడా ఇంటి నుంచే చేయగలుగుతున్నాం. అయితే డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి మోసాల బారిన పడకండా సౌకర్యవంతంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
బ్యాంకు ఖాతాలో డబ్బు ఖాళీ చేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, బీమా ఏజెంట్లు, హెల్త్కేర్ లేదా టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ కస్టమర్లను మెసగాళ్లు ఆశ్రయిస్తున్నారు. అవసరమైన సేవలను అందిస్తామంటూ.. ఇ- కేవైసీ పేరుతో గోప్యంగా ఉండే ఆధారాలను ధ్రువీకరించాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో, వెంటనే సమాచారాన్ని ధ్రువీకరించకపోతే బ్యాంకు ఖాతా రద్దవుతుందని వినియోగదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాల్స్, మేసేజ్లు, ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్, కార్డు సమాచారం, పాస్వర్డ్లు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇటువంటి కాల్స్ మేసెజ్లు, ఈ- మెయిల్ విషయంలో జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వెరిఫై చేయని మొబైల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ మోసగాళ్ల అధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా యాక్సిస్ చేయగలుగుతారు. అందువల్ల యాప్ల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
ఆన్లైన్ లావాదేవీలు చేసే వారు ఇవి గుర్తుంచుకోవాలి..
పబ్లిక్ కంప్యూటర్లు / వై-ఫై నెట్వర్క్లను వాడకండి
ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండటం మంచిది. పేరున్న, ధ్రువీకరించిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్సైట్లు తరచుగా ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయి.
కొంతమంది అత్యవసర పరిస్థితులలో వేరే వాళ్ల కంప్యూటర్ ద్వారా, పబ్లిక్ వై-ఫై ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు తొందరలో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్వర్క్ వాడిగానీ, పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయకూడదు. అలాగే బిల్లు చెల్లింపులకు ముఖ్యంగా హోటళ్లు, విమానాశ్రయ లాంజ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు వంటి ప్రదేశాలలో బిల్లు చెల్లింపుల కోసం పబ్లిక్ వై-ఫైని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇలాంటి చోట బిల్లు చెల్లింపులకు మొబైల్ నెట్వర్క్నే ఉపయోగించాలి. ఇతర ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్యక్తిగత కంప్యూటర్, వై-ఫైలను మాత్రమే వాడాలి.
మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతున్న యాప్స్ని గమనించండి..
కొన్ని యాప్లు మీ మొబైల్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావచ్చు. అటువంటి యాప్లను గమనించి అన్ఇన్స్టాల్ చేయండి. అలాగే, ఏదైనా యాప్ను మీ డివైజ్కి డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేసేముందు వాటిని నమ్మకమైన సంస్థలు రూపొందించినవా? లేదా? అని తెలుసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్ స్టోర్, ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చట్టవిరుద్ధమైన యాప్లు ఉండే అవకాశం ఉంది. అందువల్ల సమీక్షకులు ఇచ్చే రివ్యూలను పరిశీలించండి. తక్కువ సంఖ్యలో డౌన్లోడ్లు ఉన్న యాప్ల జోలికి పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉందని ధ్రువీకరించుకున్న తర్వాత మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లను ఇన్స్టాల్ చేసేటప్పుడు కెమెరా, ఫోన్బుక్, ఎస్సమ్మెస్ రీడ్ మొదలైన వాటికి అనుమతి నిరాకరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా లింక్ను క్లిక్ చేసే ముందు జాగ్రత్త
సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల కోసం అనుమానాస్పద యాప్లు, వెబ్సైట్లను నివారించాలి. ప్రైవేట్/వర్చువల్ బ్రౌజర్లను, HTTPS:// తో ప్రారంభమయ్యే సురక్షిత కనెక్షన్లను ఎంచుకుని మరింత భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా HTTP తో ప్రారంభమయ్యే సైట్లు జోలికి పోవద్దు. ఇవి సురక్షితం కాదు. HTTPS://లు, అనవసరమైన సైట్ ఓపెన్ కాకుండా, సమాచారం నిల్వ చేయకుండా నిరోధించి, సురక్షితమైన ఆన్లైన్ బ్యాంకింగ్ను అందించే విధంగా రూపొందించారు. లావాదేవీలు పూర్తైన అనంతరం వెబ్సైట్ నుంచి లాగవుట్ కావడం ఏ పరిస్థితులలోనూ మరవకూడదు.
ఈ విషయాలలోనూ జాగ్రత్త పడాలి
ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి బ్యాంక్ ఖాతా నంబర్, పాస్వర్డ్, ఏటీఎం పిన్, చిరునామా, క్రెడిట్ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కోసం కాల్ చేస్తే వారికి సమాచారం ఇవ్వకూడదు. ఎందుకంటే బ్యాంకులు, లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఇలాంటి సమాచారం కోసం కాల్ చేయవు. కాబట్టి అలాంటి కాల్స్కి సమాధానం ఇవ్వకూడదు. అలాగే ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఆన్లైన్ ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఇవ్వాలి. వీటిని తరచూ మారుస్తుండాలి. గూగుల్ ఆథన్టికేటర్/వన్-టైమ్-పాస్వర్డ్(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్