ఇండెక్స్‌ ఫండ్లతో లాభమేనా?

దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్‌ ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందిస్తుంది. ఇందులో పెట్టుబడులు ఎప్పుడూ ఆకర్షణీయమే. కానీ, నష్టభయం వెన్నంటే ఉంటుంది.

Updated : 03 Mar 2023 08:59 IST

దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్‌ ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందిస్తుంది. ఇందులో పెట్టుబడులు ఎప్పుడూ ఆకర్షణీయమే. కానీ, నష్టభయం వెన్నంటే ఉంటుంది. ఇటీవలి కాలంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చూస్తూనే ఉన్నాం. రూ.లక్షల కోట్లు ఆవిరయ్యాయి. లాభాల మాట అటుంచి, పెట్టుబడుల విలువా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో మదుపు చేయాలనుకునే వారు... దీర్ఘ  కాలిక దృష్టితో ఇండెక్స్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మరి, వీటి గురించి కొన్ని సంగతులు తెలుసుకుందామా!

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పెట్టుబడిదారుల కోసం ఎన్నో రకాల ఫండ్లను అందిస్తుంటాయి. ఇందులో ఇండెక్స్‌ ఫండ్లూ ఒకటి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన నిఫ్టీ 50, నెన్సెక్స్‌ 30 మీద ఆధారపడిన పథకాలుగా ఉంటాయి. సూచీల్లోని కంపెనీలు, ఆ కంపెనీల్లో ఒక్కో దానికి ఉన్న వెయిటేజీ ఆధారంగా ఇండెక్స్‌ ఫండ్స్‌ పెట్టుబడులు పెడతాయి. అంటే సూచీల్లో ఉన్న అన్ని కంపెనీల షేర్లకు ఆయా కంపెనీలకు ఉన్న సూచీల్లో ఉన్న వెయిటేజీ ప్రకారం పెట్టుబడుల కేటాయింపు ఉంటుంది.

* ఉదాహరణకు ఏదైనా నిఫ్టీ- 50 ఆధారిత ఇండెక్స్‌ ఫండ్‌ను పరిశీలిస్తే, ఆ ఫండ్‌ కింద నిఫ్టీ- 50లో ఉన్న అన్ని షేర్లను, అదే వెయిటేజీ ప్రకారం కొనుగోలు చేస్తుంది.

* సూచీలను క్రమం తప్పకుండా సవరిస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీలను తొలగించి, కొత్త కంపెనీలను జతచేస్తారు దీన్ని రీ-బ్యాలెన్సింగ్‌ అంటారు. ఇలా రీ-బ్యాలెన్సింగ్‌ జరిగిన ప్రతిసారీ ఇండెక్స్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను ఆ మేరకు సవరిస్తాయి.

* ఇటువంటి పథకాల్లో ఫండ్‌ మేనేజర్‌ క్రియాశీలత ఏమీ ఉండదు. ఇండెక్స్‌ షేర్లలో వాటి వెయిటేజీ ప్రకారం పెట్టుబడులు కేటాయించటమే. అంతేగానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం, అవకాశం ఉండదు.

* ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడంలో ఉన్న మరొక ప్రయోజనం, వాటి నిర్వహణ ఛార్జీలు (ఎక్స్‌పెన్సెస్‌ రేషియో) తక్కువగా ఉండటమే. ‘రెగ్యులర్‌’ మూచ్యువల్‌ ఫండ్‌ పథకాలకు నిర్వహణ ఛార్జీలు 1.5 శాతం నుంచి 2.25 శాతం వరకూ ఉంటున్నాయి. కానీ ఇండెక్స్‌ ఫండ్స్‌పై నిర్వహణ ఛార్జీలు 0.2 నుంచి 0.3 శాతం ఉంటున్నాయి.

ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30, నిఫ్టీ నెక్ట్స్‌ 50, బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఆధారిత ఇండెక్స్‌ ఫండ్స్‌ ను నిర్వహిస్తున్నాయి. ఇవే కాకుండా నాస్‌డాక్‌ 100 వంటి అంతర్జాతీయ ఇండెక్స్‌ ఫండ్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి.

ఇండెక్స్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా ‘పోర్ట్‌ఫోలియో వైవిధ్యం’ సాధించినట్లే. వివిధ రంగాలకు చెందిన అగ్రశ్రేణి  కంపెనీలను ఎంపిక చేసి సూచీల్లో స్థానం కల్పిస్తారు. కాబట్టి ఇండెక్స్‌ ఫండ్స్‌ కొనటం అంటే సంబంధిత సూచీల్లోని అన్ని కంపెనీలపై మనం పెట్టుబడి పెట్టినట్లే. సూచీల్లో ఏ మేరకు వృద్ధి నమోదవుతుందో... అంతే స్థాయిలో ఇండెక్స్‌ ఫండ్స్‌ ప్రతిఫలం ఉంటుంది.

ఒకేసారి ఏక మొత్తం పెట్టుబడి మాదిరిగా కాకుండా సిప్‌ (క్రమానుగత పెట్టుబడి)  పద్దతిలో వారానికోసారి లేదా నెలకోసారి వాయిదాల్లో ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనివల్ల ‘కాస్ట్‌ యావరేజింగ్‌’ ప్రయోజనాన్ని అందుకోవచ్చు.

ఏదైనా ఒక కంపెనీ లేదా నాలుగైదు కంపెనీలపై పెట్టుబడి పెట్టినప్పుడు ఆ కంపెనీల పనితీరును నిరంతరం గమనిస్తూ ఉండాలి. మార్కెట్‌ కరెక్షన్‌కు లోనైనప్పుడు ఆయా షేర్ల ధరలు బాగా పతనమై నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇటువంటి ప్రమాదం సూచీల ఆధారిత పెట్టుబడులు- అంటే ఇండెక్స్‌ ఫండ్స్‌లోనూ ఉంటుంది. కానీ నష్ట భయం తక్కువ కావటంతో పాటు, మళ్లీ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని