Elon Musk: నా పిల్లలకు సంస్థలో చోటివ్వను: ఎలాన్‌ మస్క్‌

భవిష్యత్‌లో వ్యాపార బాధ్యతలను తన పిల్లలకు ఇవ్వాలని అనుకోవడం లేదని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

Published : 25 May 2023 21:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిలియనీర్‌ ఎలాన్‌మస్క్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. గత అక్టోబరులో ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది. స్పేస్‌ ఎక్స్‌, టెస్లా సంస్థలలతోపాటు ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగులను తొలగించడంతోపాటు, బ్లూ టిక్‌, పెయిడ్‌ ఆప్షన్‌లను తీసుకొచ్చి వివాదాలకు కూడా కేంద్ర బిందువైన మస్క్‌ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. భవిష్యత్‌లో వ్యాపార బాధ్యతలను తన పిల్లలకు ఇవ్వాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ఏ వ్యాపారవేత్తయినా తన తర్వాత వారసులుగా పిల్లలకు అవకాశమిస్తారని, కానీ, తాను మాత్రం అలాంటి విధానాలకు పూర్తి విరుద్ధమని మస్క్‌ పేర్కొన్నారు. ‘‘ కొంతమంది వ్యాపార వేత్తలు తమ కుమారులు అసమర్థులైనప్పటికీ బిజినెస్‌ను వారి చేతుల్లో పెడుతుంటారు. కంపెనీల్లో కొన్ని షేర్లను వారి పేరిట రాసి,  బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల స్థానంలోకి తీసుకుంటారు. అది చాలా తప్పని నేను బలంగా నమ్ముతాను. నేను ఆ కోవకు చెందిన వాడిని కాదు. వాళ్లకు ఆసక్తి లేకపోయినా బలవంతంగా వ్యాపారంలోకి నెట్టడం సరికాదు. దీని వల్ల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది.’’ అని ఎలాన్‌ మస్క్‌ అన్నారు.

‘వారసత్వం’ తరతరాలుగా వస్తున్న సమస్య అని ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి.. రాజ్యాలు, రాజులు, దేశాలు, చివరికి సీఈవోల వరకు వారసత్వమే నడుస్తోందని అన్నారు. దీనికి సరైన పరిష్కారం లేదని చెప్పారు. ‘‘ అందుకే నా విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నా తర్వాత ఎవరు పగ్గాలు చేపట్టాలనే దానిపై బోర్డు మెంబర్లకు చెప్పాను. అనుకోకుండా నాకేమైనా జరిగితే వాళ్లు సంస్థను టేకోవర్‌ చేసుకుంటారు. అలాగని నేను చెప్పిన వ్యక్తే పగ్గాలు చేపట్టాలని లేదు. బోర్డు మెంబర్లు స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ, పరిస్థితులు గాడిలో పడేంత వరకు నేను ప్రతిపాదించిన వ్యక్తి పగ్గాలు చేపడతారు’’ అని ఎలాన్‌ మస్క్‌ అన్నారు.

మరోవైపు ఎలాన్‌మస్క్‌ తాజాగా తన నాలుగేళ్ల కొడుకు ఏఈ ఏ-12, కుమార్తె ఎక్సాడార్క్‌ సిడేరియల్‌ మస్క్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గత సెప్టెంబరులో గ్రిమ్స్‌, ఎలాన్‌మస్క్‌ విడిపోయిన తర్వాత ఈ పిల్లలను విడివిడిగా పెంచుకుంటున్నారు. అంటే పిల్లలు కొన్నాళ్లు తల్లివద్దనుంటే.. మరికొన్నాళ్లు తండ్రి దగ్గర ఉంటారు. అంతేకాకుండా షివాన్‌ జిలిస్‌తో వివాహేతర  సంబంధం కారణంగా 2021 నవంబరులో కవలలు జన్మించారు. ఈ నలుగురు పిల్లలతోపాటు తొలి భార్య జస్టిన్‌ విల్సన్‌కు 18 ఏళ్ల కవలలు వివాన్‌ జెన్నా విల్సన్‌, గ్రిప్ఫిన్‌ ఉండగా, 2006లో కాయ్‌, డామినయ్‌, సాక్స్‌ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని