Investments: ₹5లక్షలు ఉన్నాయా?పెట్టుబడికి ఈ 3 మార్గాలను పరిశీలించండి!
మీ దగ్గర రూ.5-10 లక్షలు ఉంటే.. వాటిని పెట్టుబడి పెట్టడానికి ఈ మూడు మార్గాలను పరిశీలించండి...
ఇంటర్నెట్ డెస్క్: అనుకోకుండా మొండి బాకీలు వసూలు కావడమో, పండగల సీజన్లో బోనస్లు, రివార్డులు అందడమో జరిగినప్పుడు ఒక్కసారిగా కొంత మొత్తం చేతికందుతుంటుంది. ప్రణాళికలో లేని ఆ డబ్బుని ఏం చేయాలో ఒక్కోసారి అంతుచిక్కదు. అలా అని అంత మొత్తాన్ని దుబారాగా ఖర్చు చేయడం సరికాదు. పోనీ ఏదైనా ఆస్తి కొనిపెట్టుకుందామంటే.. ఆ డబ్బు సరిపోదు. రెగ్యులర్గా చేసే ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) లో రాబడి పెద్దగా ఉండదు. అలాంటప్పుడు మీ చేతికందిన డబ్బుకు మీ పొదుపులోని మరింత మొత్తాన్ని చేర్చి కనీసం రూ.5-10 లక్షలు సమకూర్చుకోండి. మంచి రాబడి కోసం ఈ కింద తెలిపిన మర్గాల్లో పెట్టుబడి (Investments) పెట్టడానికి ప్రయత్నించండి!
సూచీ ఫండ్లు (Index Fund) సురక్షితం..
కొత్తగా ఈక్విటీల్లో మదుపు చేస్తున్న వారు ఈ ఫండ్లను తొలి మెట్టుగా భావించవచ్చు. పేరులోనే ఉన్నట్లు ఈ ఫండ్లు (Index Fund) సూచీల్లో ఉన్న షేర్లలోనే మదుపు చేస్తాయి. సూచీలో ఒక్కో షేరుకు ఎంత వెయిటేజీ కేటాయించారో అదే నిష్పత్తిలో ఈ ఫండ్లూ ఆయా షేర్లలో మదుపు చేస్తాయి. సూచీల్లో ఆ షేరుకు వెయిటేజీ మారితే.. అందుకు తగ్గట్టుగానే ఫండ్ పెట్టుబడుల్లోనూ సర్దుబాటు జరుగుతుంది. ఉదాహరణకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ (Index Fund).. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుందన్నమాట. స్వల్పకాలంలో ఈ ఫండ్ల పనితీరులో కాస్త హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఇవి పరిమితమే. వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టాన్ని భరించే సామర్థ్యం, వ్యవధి, ఆర్థిక లక్ష్యాలు తదితరాలను బట్టి, నిర్ణయం తీసుకోవాలి.
పసిడి పట్టు పట్టండి..
సంప్రదాయంగా పసిడిని సురక్షిత పెట్టుబడి పథకంగా భావిస్తుంటారు. కొనుగోలు చేసేటప్పుడు చాలామందికి నాణ్యత విషయంలో సందేహం ఉంటుంది. పైగా దాన్ని భద్రపర్చుకోవడం ఒక సమస్యగానూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bond-SGB). బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి సులభంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ సార్వభౌమ పసిడి బాండ్ల (Sovereign Gold Bond-SGB)ను అందుబాటులోకి తెచ్చింది. 2015 నవంబరు 5న ఈ బాండ్లను తొలిసారిగా ఆర్బీఐ విడుదల చేసింది. ఆదరణ బాగుండటంతో ఆర్బీఐ వరసగా ఈ బాండ్లను విడుదల చేయడం ప్రారంభించింది. 2017-18 లో ఏకంగా 14 విడతల్లో ఈ బాండ్ల (Sovereign Gold Bond)ను జారీ చేసింది. తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడికి అవకాశం ఉండటం, పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5శాతం వడ్డీ లెక్కన, ఆరు నెలలకోసారి చెల్లించడంలాంటి ప్రయోజనాలతో చాలామంది తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. అంటే, ఈ ఆరేళ్లలో దాదాపు 75 శాతం వరకు రాబడి వచ్చిందన్నమాట. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వచ్చిన బాండ్ విలువ రూ.2,951. ఈ నాలుగేళ్లలో 59శాతానికి దరిదాపుల్లో రాబడి అందింది. దీనికి ఆరు నెలలకోసారి వచ్చే వడ్డీ అదనం అన్నది గుర్తుంచుకోవాలి. అయితే, స్వల్పకాలిక పెట్టుబడులకు వర్తించే పన్ను నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
తక్కువ డబ్బుతోనే రియల్ ఎస్టేట్లోకి..
ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉన్న నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన నిర్మాణాలలో రీట్స్ పెట్టుబడి పెడుతుంది. ఇది నివాస గృహాలైనా కావచ్చు.. వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, గోదాములు, కార్యాలయాలు ఇలా ఏదైనా ఉండొచ్చు.. రీట్స్ (REITs)లో మదుపు చేసిన మదుపరులకు క్రమం తప్పకుండా ఆదాయం రావడంతోపాటు.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికీ ఇది అవకాశం కల్పిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం రీట్స్ 80శాతం మేరకు ఆదాయం ఆర్జిస్తున్న పూర్తయిన నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రీట్స్ (REITs) రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఒకటి ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుండగా..మరోటి ట్రేడింగ్లో ఉండదు.
వంతెనలు, రహదారులు, రోడ్లు, పైప్లైన్లు, విద్యుత్ ప్లాంట్లు తదితర భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఇన్విట్స్ మదుపు చేస్తాయి. మొత్తం పెట్టుబడిలో తప్పనిసరిగా 80శాతం వరకూ పూర్తయిన ప్రాజెక్టులలోనే మదుపు చేయాల్సి ఉంటుంది. అవి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండాలి. ఈ రెండు పథకాల్లోనూ ఆర్జించిన ఆదాయంలో 90శాతం వరకూ యూనిట్ హోల్డర్లు/పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలి.
రీట్స్ (REITs), ఇన్విట్స్ (InvITs)ను ఎంచుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మదుపు చేసేందుకు ఆస్కారం లభిస్తుంది. స్థిరాస్తులు, మౌలిక వసతుల ప్రాజెక్టులలో యాజమాన్యం లభిస్తుందనీ చెప్పొచ్చు. పైగా నిర్వహణ, స్టాంపు డ్యూటీ, ఇతర ఖర్చుల్లాంటి ఇబ్బందులేమీ ఉండవు. ఈ కొత్త తరహా పథకాలు మదుపరుల పెట్టుబడుల వివిధీకరణకు తోడ్పడతాయి. డివిడెండ్ల రూపంలో క్రమం తప్పని ఆదాయాన్నీ ఆర్జించవచ్చు. దీంతోపాటు మూలధన వృద్ధికీ అవకాశం ఉంటుంది. నేరుగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడికి భారీ మొత్తం అవసరం. కానీ, రీట్స్ (REITs), ఇన్విట్స్ (InvITs)లో మదుపు చేయడానికి పెద్ద మొత్తం అవసరం కూడా లేదు. గతంలో రీట్స్లో కనీస పెట్టుబడి రూ.50,000 ఇన్విట్స్ (InvITs)లో రూ.1,00,000 ఉండేది. కానీ, 2021-22 బడ్జెట్లో దీన్ని సవరించారు. రీట్స్లో కనీసం రూ.10,000, ఇన్విట్స్లో రూ.15,000లతోనూ మదుపు చేసే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ ద్వారా నేరుగా ఈ పథకాల్లో మదుపు చేయడం ఇబ్బంది అనుకుంటే.. మ్యూచువల్ ఫండ్ల ద్వారానూ వీటిలో మదుపు చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్