KP Singh: ‘ఆమె చురుకైంది’.. 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడిన డీఎల్‌ఎఫ్ అధినేత కేపీ సింగ్

రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌(DLF) యజమాని కేపీ సింగ్‌ ( KP Singh) 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. ఆయన తన భాగస్వామి వివరాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Updated : 28 Feb 2023 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరి వాడైన తనకు ఓ తోడు దొరికిందని రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌(DLF) ఛైర్మన్‌ కేపీ సింగ్‌( KP Singh ) ప్రకటించారు. 65 ఏళ్ల బంధం తర్వాత భాగస్వామిని కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేమని పేర్కొన్నారు. జీవితంలో మనిషికి ఓ భాగస్వామి ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. తన కొత్త స్నేహితురాలి విశేషాలను ఆయన ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌తో పంచుకొన్నారు.

నా భార్యే.. నా మిత్రురాలు..!

‘నాకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంది. నాకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రురాలు నా భార్యే. మేము మంచి భాగస్వాములం. ఆమెను కాపాడుకునేందుకు నేను సర్వశక్తులూ ఒడ్డాను. కానీ, ఏవీ సఫలం కాలేదు. ఆ తర్వాత నేను ఒంటరినైపోయాను. మానసిక కుంగుబాటుకు గురయ్యాను. మీకు ఓ కంపెనీని నిర్వహించే శక్తిని అది ఇవ్వదు. సహజంగానే మీరు 65 ఏళ్ల భాగస్వామ్యం తర్వాత భార్యను కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉండలేరు. మీరు భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కేపీ సింగ్‌ వివరించారు.

అందుకే కంపెనీ బాధ్యతలకు దూరం..

భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్‌ చెప్పారు. ప్రేమించిన వారు దూరం కావడం, వయసు 91 ఏళ్లకు చేరడంతో నిర్ణయాలు తీసుకునే ప్రతిస్పందన తత్వం నెమ్మదిస్తుందన్నారు. కంపెనీ కోసం పనిచేసే సమయంలో పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యమని భావించినట్లు వివరించారు. కానీ, బాధల్లో ఉండటంతో పూర్తి సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని.. అందుకే తాను యాజమాన్యం నుంచి దూరమైనట్లు సింగ్‌ వెల్లడించారు.

‘‘మీకు 90 ఏళ్లు వస్తే.. ఓ లిస్టెడ్‌ కంపెనీ యాక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కచ్చితంగా వైదొలగాలి. ఇక నా కుమారుడు యాజమాన్య బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకొన్నాను. నేను ఇంకా కొనసాగే రకం కాదు. అందుకే ‘గౌరవ’ పదవిలో మాత్రమే కొనసాగుతున్నాను. వాస్తవానికి నా కుమారుడు నాకంటే మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు. విలువల విషయంలో రాజీపడలేదు. అందుకే నేను సంతోషంగా ఉన్నాను’’ అని కేపీ సింగ్‌ పేర్కొన్నారు.

మిగిలిన జీవితం నాకోసం..

పని నుంచి తనను తాను దూరంగా ఉంచుకోవాలని సింగ్‌ భావిస్తున్నారు. ఇక నుంచి తనకు ఇష్టమైన పనులు చేయడం కోసం సమయాన్ని వెచ్చించనున్నారు. ‘‘నాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మిత్రులు, స్నేహ సంబంధాలు ఉన్నాయి.  నేను గోల్ఫ్‌ ఆటగాడిని కూడా. చాలా చురుగ్గా ఉన్నాను’’ అని సింగ్‌ వివరించారు. 

సరికొత్త భాగస్వామ్యంపై..

మరణించడానికి ఆరు నెలల ముందు ఓ రోజు నా భార్య ఇందిర నా వద్దకు వచ్చి మాట్లాడిందన్నారు.  జీవితంలో చేస్తున్న పనులను వదిలేయ వద్దని కోరినట్లు చెప్పారు. ‘‘సంతోషంగా జీవించే జంట కోరిక ఒక్కటే.. జీవన ప్రయాణంలో ఇద్దరూ కలిసి వెళ్లాలని. ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలిపోకూడదు. కానీ నా విషయంలో ఏమైంది.. నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించావు. కానీ, కొన్ని నెలల్లో నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను. అందుకే.. నేను వెళ్లిపోయినా.. నీ ముందు చాలా జీవితం ఉంది. నాకో మాటివ్వు.. నా తర్వాత కూడా నీ జీవితంలో నిరాశపడకు. అది ఏరకంగా నీకు సాయం చేయదు. ఈ జీవితం మళ్లీ నీకు తిరిగిరాదు’’ అని కోరినట్లు సింగ్‌ చెప్పారు.

2018లో ఆమె మరణం తర్వాత దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో జీవించినట్లు సింగ్‌ వెల్లడించారు. ఆ తర్వాత ఓ జీవిత భాగస్వామి దొరికనట్లు వెల్లడించారు. ‘‘నేను చాలా అదృష్టవంతుడిని. ఓ మనోహరమైన వ్యక్తిని కలిశాను. ఇప్పుడు తను నా భాగస్వామి. ఆమె పేరు షీనా. నేను జీవితంలో కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమె చాలా హుషారుగా ఉంటారు. నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతున్నారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా చాలా అద్భుతమైన మిత్రులు ఉన్నారు. నేను ఎప్పుడైనా జీవితంలో నిరాశకు గురైనా.. ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. నేను ఈ రోజు ఉత్సాహంగా ఉన్నానంటే ఆమే కారణమని చెబుతాను’’ అని సింగ్‌ వెల్లడించారు.  

జార్జి సోరస్‌ వ్యాఖ్యలపై ఏమన్నారంటే..

ఇటీవల బిలియనీర్‌ జార్జిసోరస్‌ వృద్ధాప్యం కారణంగా అదానీ-హిండెన్‌ బర్గ్‌ వ్యవహారం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఆరోపణలపై సింగ్‌ స్పందించారు. ‘‘ప్రస్తుతం నా వయసు ఎంత..? చాలా మంది 70 ఏళ్లు అనుకొంటారు. ఎందుకంటే నేను చురుగ్గా ఉన్నాను కాబట్టి’’ అంటూ సింగ్‌ పెద్దగా నవ్వేశారు.

తన మామయ్య స్థాపించిన డీఎల్‌ఎఫ్‌లో 1961లో కేపీ సింగ్‌ చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2020లో ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు. సింగ్‌ ప్రస్తుత ఆస్తి రూ.66 వేల కోట్లు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని