Income tax on Gold: బంగారం కొంటున్నారా..ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందో తెలుసా?

విక్రయించేప్పుడు వచ్చే మూలధన లాభంపై పన్ను వర్తిస్తుంది. 

Updated : 03 May 2022 16:49 IST

అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయ‌డాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందువ‌ల్ల చాలా మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఆశ‌క్తి చూపుతారు. బంగారంపై పెట్టుబ‌డులు చేసేవారు సంబంధిత ప‌న్ను నియ‌మాల‌ను తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ప్ర‌స్తుతం ప‌సిడి వివిధ రూపాల‌లో ల‌భ్య‌మ‌వుతుంది. భౌతికంగా..నగలు, కడ్డీ/నాణేల రూపంలోనూ; కాగితాల రూపంలో..గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఆర్బీఐ జారీచేసే సార్వభౌమ పసిడి పథకాల రూపంలోనూ, డిజిట‌ల్‌గానూ పసిడి కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు విక్రయించేటప్పుడు వచ్చే మూలధన లాభంపై పన్ను వర్తిస్తుంది. 

భౌతిక బంగారం..
ఆభ‌ర‌ణాలు, నాణేలు, బార్లు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని ఎంత కాలానికి విక్రయించారు (స్వల్పకాలం లేదా దీర్ఘకాలం) అనే అంశంపై ప‌న్ను ఆధార‌ప‌డి ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవ‌త్సరాల్లోపు విక్రయిస్తే స్వల్ప కాలంగానూ..మూడేళ్లు మించితే దీర్ఘకాలంగానూ పరిగణించి మూలధన లాభంపై పన్ను విధిస్తారు. స్వల్పకాల మూలధన లాభాలను (ఎస్‌టీసీజీ) ఆదాయానికి చేర్చి వ్యక్తికి వర్తించే స్లాబ్‌ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ)పై 20.8శాతం (సెస్‌తో క‌లిపి) ఇండెక్సేషేన్‌ బెనిఫిట్‌తో ప‌న్ను వ‌ర్తిస్తుంది. అంతేకాకుండా, భౌతిక బంగారం కొనుగోలు స‌మ‌యంలో 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. న‌గ‌ల రూపంలో కొనుగోలు చేస్తే త‌యారీ ఛార్జీలూ వ‌ర్తిస్తాయి. భౌతిక బంగారాన్ని విక్రయించే సమయంలో టీడీఎస్‌ వర్తించదు. కానీ రూ.2 లక్షల పైన నగదు రూపంలో చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే ఒక శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది.

డిజిట‌ల్ గోల్డ్‌..
డిజిట‌ల్ బంగారానికి కూడా భౌతిక బంగారానికి వ‌ర్తించిన‌ట్లే కాల‌వ్యవధిపై ఆధారపడి పన్ను వర్తిస్తుంది. బంగారాన్ని మూడు సంవ‌త్సరాల తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసీజీగా ప‌రిగణించి 20.8శాతం (సెస్‌తో క‌లిపి) ఇండెక్సేషేన్‌ బెనిఫిట్‌తో ప‌న్ను విధిస్తారు. అయితే డిజిట‌ల్ గోల్డ్‌లో స్వల్పకాల రాబడిపై డైరెక్ట్‌గా పన్ను విధించరు. చాలా త‌క్కువ మొత్తంతో అంటే క‌నీసం రూ.1 నుంచే డిజిటల్ బంగారంలో పెట్టుబ‌డులు ప్రారంభించొచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో సుల‌భంగా కొనుగోలు చేయ‌డం, నిల్వ సమ‌స్య లేక‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో డిజిటల్‌ గోల్డ్‌ ప్రాచుర్యం పొందుతోంది. ఎంఎంటీసి లాంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ అందిస్తారు. ఫోన్ పే, జీ పే, పేటీఎం లాంటి మొబైల్ యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

పేప‌ర్ గోల్డ్‌..
గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు, సార్వభౌమ ప‌సిడి బాండ్లు (ఎస్‌జీబీ) ఇందులోకి వ‌స్తాయి. బంగారం భౌతికంగా ఉండదు, కాగిత రూపంలోనే ఉంటుంది. వీటిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లకు భౌతిక బంగారం మాదిరిగానే పన్ను విధిస్తారు. మూడేళ్లకు మించి కొన‌సాగిస్తే ఎల్‌టీసీజీ పన్ను 20.8శాతం (సెస్‌తో క‌లిపి) ఇండెక్సేషేన్‌ బెనిఫిట్‌తో ప‌న్ను వ‌ర్తిస్తుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఎప్పుడైనా ఎక్స్‌ఛేంజ్‌ల్లో అమ్మొచ్చు. కాబట్టి సార్వభౌమ పసిడి బాండ్ల కంటే గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల‌లో లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది. 

అయితే, సార్వభౌమ పసిడి పథకాలపై వ‌ర్తించే పన్ను కాస్త భిన్నంగా ఉంటుంది. సార్వభౌమ పసిడి పథకాల్లో పెట్టిన పెట్టుబడిపై వార్షికంగా 2.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇది మీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయానికి చేర్చి వ‌ర్తించే స్లాబ్‌ రేటు ప్రకారం ప‌న్ను విధిస్తారు. అయితే, ఈ బాండ్లకు 8 సంవ‌త్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ కాల‌ప‌రిమితి పూర్తయ్యే వరకు పెట్టుబ‌డులు కొనసాగిస్తే లాభాల‌పై ప‌న్ను ఉండ‌దు. ఇందులో 5 సంవ‌త్సరాల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. 5 సంవ‌త్సరాల తర్వాత ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమతిస్తారు. ఐదేళ్ల తర్వాత, ఎనిమిదేళ్ల ముందు వరకు విత్‌డ్రా చేసుకుంటే ఎల్‌టీసీజీ ప‌న్ను 20.8 శాతం (సెస్‌తో క‌లిపి) ఇండెక్సేషేన్‌ బెనిఫిట్‌తో ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

పెట్టుబ‌డిదారులు సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనుగోలు, విక్ర‌యం రెండూ చేయ‌వ‌చ్చు. మూడేళ్ల‌కు ముందే విక్ర‌యిస్తే వ్య‌క్తికి వ‌ర్తించే ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం, మూడేళ్ల త‌ర్వాత విక్ర‌యిస్తే ఎల్‌టీసీజీ ప‌న్ను 20.8 శాతం (సెస్‌తో క‌లిపి) ఇండెక్సేషేన్‌ బెనిఫిట్‌తో ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

గోల్డ్ డెరివేటీవ్‌లు..
వీటిపై వ‌ర్తించే ప‌న్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీవ్‌ల నుంచి వ‌చ్చే రాబ‌డి 'వ్యాపారంపై వ‌చ్చే ఆదాయం'గా చూపించాల్సి ఉంటుంది. వ్యాపార నిమిత్తం ట‌ర్నోవ‌ర్ రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఉంటే 6 శాతం ప‌న్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే, టర్నోవర్ రూ. 2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేం.

బ‌హుమ‌తిగా బంగారం..
త‌ల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లల నుంచి బ‌హుమ‌తిగా బంగారం స్వీక‌రిస్తే, ఆ బంగారంపై ప‌న్ను వ‌ర్తించ‌దు. కానీ ఇత‌రుల నుంచి బంగారాన్ని బ‌హుమ‌తిగా పొంది.. దాని విలువ రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే వారికి వ‌ర్తించే వ్యక్తిగత ప‌న్ను స్లాబ్ ప్రకారం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ బంగారం విలువ రూ.50 వేల కంటే త‌క్కువ ఉంటే ఎటువంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని