‘భారత్‌కు 31 వేల మంది పైలట్లు అవసరం’.. బోయింగ్‌ అంచనా!

విమానయాన సంస్థలకు అందిన ఆర్డర్‌ల ప్రకారం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పైలట్లు, నిపుణులైన సాంకేతిక సిబ్బంది అవసరం  భారత్‌కు ఉంటుందని విమాన తయారీ సంస్థ బోయింగ్ అంచనా వేసింది. 

Updated : 21 Mar 2023 20:10 IST

ముంబయి: భారత విమానయాన రంగంలో రాబోయే 20 ఏళ్లలో వేల సంఖ్యలో పైలట్లు (Pilots), సాంకేతికత సిబ్బంది (Technical Staff) అవసరం ఉంటుందని అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) అంచనా వేసింది. భారత విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు ఆర్డర్‌లు పెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్‌ నుంచి అందిన ఆర్డర్‌ల ప్రకారం భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిపుణులైన సిబ్బంది అవసరం ఏర్పడుతుందని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్‌ సలిల్‌ గుప్తే చెప్పారు. 

‘‘రాబోయే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతం ప్రపంచస్థాయి సంస్థలకు అనుకూలమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతుంది. విమానతయారీ సంస్థల నుంచి భారతీయ విమానయాన సంస్థలకు అందబోయే విమానాల నిర్వహణ కోసం భవిష్యత్తులో 31 వేల మంది పైలట్లు, 26 వేల మంది సాంకేతిక సిబ్బంది అవసరమవుతారు. విమానరంగంలో భారత్‌ సాధించిన అభివృద్ధికి ఇది నిదర్శనం. దాంతోపాటే విమానాశ్రయాల నిర్మాణం పెరుగుతుండటం శుభపరిణామం’’ అని సలిల్‌ గుప్తే అన్నారు. 

ఎయిరిండియాను టాటా గ్రూప్‌ సొంతం చేసుకున్న తర్వాత గత నెలలో 470 విమానాలకు ఆర్డర్‌ పెట్టింది. వీటిలో బోయింగ్‌ నుంచి 220, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు ఆర్డర్‌ చేసింది. అలానే ఇండిగో కూడా తన విమానాల సంఖ్యను 500 నుంచి 1300కు పెంచాలనే యోచనలో ఉన్నట్లు విమాన కన్సల్టెన్సీ సంస్థ కాపా గత నెలలో వెల్లడించింది. దాని ప్రకారం 2040 నాటికి భారత్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ ఏడు శాతం మేర పెరుగుతుందని బోయింగ్‌ అంచనా. ‘‘కరోనా పరిస్థితుల తర్వాత విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఆర్థికంగా ఇది విమాన ప్రయాణాల వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. రాబోయే 20 ఏళ్లలో మార్కెట్‌లో 90 శాతం నారో బాడీ (చిన్న) విమానాలకు డిమాండ్ ఉంటుంది. అందులో కూడా బోయింగ్‌ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాం. వైడ్‌ బాడీ (పెద్ద) విమానాల మార్కెట్‌లో బోయింగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ స్థానాన్ని బోయింగ్ భారత్‌ సహా అన్ని మార్కెట్‌లలో కొనసాగిస్తుంది’’ అని సలీల్‌ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని