World Competitive Index: పోటీతత్వ సూచీలో ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్

ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.

Published : 15 Jun 2022 15:26 IST

దిల్లీ: ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండీ) అధ్యయనంలో.. భారత్‌ ఆరు స్థానాలు ఎగబాకి, 43వ ర్యాంకు నుంచి 37వ ర్యాంకుకు చేరింది. దీంతో ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో మనదేశం వేగవంతమైన పెరుగుదలను కనబరిచింది. 

ఈ పోటీతత్వ సూచీలో 63 దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతకు ముందు ఏడాది అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. స్వీడన్, హాంకాంగ్‌, నెదర్లాండ్స్, తైవాన్‌, ఫిన్లాండ్, నార్వే, యూఎస్‌ఏ.. మొదటి పది ర్యాంకులు సాధించాయి. ఆసియాలో ఆర్థికవ్యవస్థల్లో సింగపూర్‌(3), హాంకాంగ్‌(5), తైవాన్‌(7), చైనా(17) మెరుగైన స్థానాలు పొందాయి. 

ఆర్థిక వ్యవస్థ పనితీరులోని ప్రతిఫలాలు భారత్ ర్యాంకు మెరుగయ్యేందుకు దోహదం చేసినట్లు ఐఎండీ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది. వ్యాపార సామర్థ్య పారామీటర్లలో కీలకమైన లేబర్ మార్కెట్ 15వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. అలాగే నిర్వహణ పద్ధతులు, వ్యాపార విలువలు ఇక్కడ కీలకంగా మారాయని చెప్పింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రెట్రోస్పెక్టివ్ పన్నుల్లో మెరుగులు దిద్దడం వ్యాపార రంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించిందని పేర్కొంది. అలాగే వాతావరణ మార్పులు అంశంపై భారత్ చురుగ్గా పనిచేస్తుండటం కలిసొచ్చింది. వాణిజ్య అంతరాయాలు, ఇంధన భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహమ్మారి తర్వాత అధిక జీడీపీ వృద్ధిని కొనసాగించడం వంటి సవాళ్లు ఉన్నాయని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని