Remittances: ఈ ఏడాది రికార్డు స్థాయికి రెమిటెన్స్‌లు.. ప్రపంచ బ్యాంకు అంచనా!

ఈ ఏడాది భారత్‌కు అందే రెమిటెన్స్‌లు రికార్డు స్థాయికి చేరతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యూఎస్‌, యూకే, సింగపూర్‌ నుంచి వచ్చే నిధులు పెరుగుతున్నాయని తెలిపింది.

Published : 01 Dec 2022 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోని తమ కుటుంబీకులకు ప్రవాసుల నుంచి అందే నిధులు (Remittance) ఈ ఏడాది రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్‌లు అందుకుంటున్న దేశంగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని తెలిపింది.

ఈ ఏడాది రెమిటెన్స్‌ల విలువ 12 శాతం పెరిగి 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో అత్యధిక ప్రవాసులు ఉండే చైనా, మెక్సికో, ఫిలిప్ఫైన్స్‌ కంటే భారత్‌ చాలా ముందంజలో ఉంటుందని తెలిపింది. అమెరికా, యూకే, సింగపూర్‌లో ఉన్న నైపుణ్యంగల కార్మికులు/ఉద్యోగులు ఈ ఏడాది పెద్ద ఎత్తున నిధులు భారత్‌కు పంపుతున్నారని పేర్కొంది. తక్కువ వేతనాలు ఉండే గల్ఫ్‌ వంటి దేశాల నుంచి భారత్‌కు చెందిన ప్రవాసులు గత కొన్నేళ్లుగా అధిక వేతనాలిచ్చే యూఎస్‌, యూకే, సింగపూర్‌ వంటి దేశాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపింది. మరోవైపు వేతనాల పెంపు, ఉద్యోగిత గరిష్ఠానికి చేరడం, రూపాయి బలహీనత కూడా రికార్డు స్థాయి రెమిటెన్స్‌లకు కారణమని వివరించింది.

భారత విదేశీ మారక నిల్వలకు ప్రవాసులు పంపే నిధులు ఒక ప్రధాన వనరు. గత ఏడాది కాలంగా రేట్ల పెంపు, రూపాయి బలహీనత కారణంగా మన దేశ మారక నిల్వలు 100 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిన విషయం తెలిసిందే.  భారత జీడీపీలో మూడు శాతం వాటా ఉన్న రెమిటెన్స్‌లు విదేశీ మారక ద్రవ్య లోటును పూడ్చుకోవడానికీ చాలా ముఖ్యం. ధనిక దేశాల్లోని ప్రవాసుల నుంచి భారత్‌కు వచ్చిన నిధులు 2020-21లో 36 శాతం పెరిగాయి. 2016-17లో ఇవి 26 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ సహా మొత్తం ఐదు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే నిధుల విలువ 54 శాతం నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకకు మాత్రం ఏడాది రెమిటెన్స్‌లు తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని