నాలుగేళ్లలో ఈ-కామర్స్‌ మార్కెట్‌లో 84% వృద్ధి!

కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో ఊపందుకున్న ఈ-కామర్స్‌.. రానున్న రోజుల్లో మరింత భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. 2024 నాటికి దేశంలో

Published : 10 Mar 2021 21:05 IST

ఎఫ్‌ఐఎస్ నివేదిక అంచనా

దిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో ఊపందుకున్న ఈ-కామర్స్‌.. రానున్న రోజుల్లో మరింత భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. 2024 నాటికి దేశంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ 84 శాతం వృద్ధి చెంది 111 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. ఈ మేరకు 41 దేశాల్లో చెల్లింపుల పోకడలపై అధ్యయనం చేసిన అంతర్జాతీయ ఆర్థిక-సాంకేతిక సంస్థ ‘ఫిడెలిటీ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్’‌(ఎఫ్‌ఐఎస్‌) బుధవారం నివేదిక విడుదల చేసింది.

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కామర్స్‌కు డిమాండ్‌ పెరిగిందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా చెల్లింపుల విషయంలో భారత్‌ సహా అనేక దేశాల్లో వినియోగదారులు కొత్త విధానాల వైపు మొగ్గుచూపారని పేర్కొంది. 2020లో భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ ఎక్కువగా ‘మొబైల్ షాపింగ్’ ద్వారా నడిచిందని.. రాబోయే నాలుగేళ్లలో అది 21శాతం వృద్ధి నమోదు చేయనుందని అంచనా వేసింది. తర్వాత డిజిటల్ వాలెట్ల ద్వారా 40 శాతం, క్రెడిట్ కార్డులు 15 శాతం, డెబిట్ కార్డులతో 15 శాతం వ్యాపారం సాగినట్లు వెల్లడించింది. ఇక ఆన్‌లైన్‌ చెల్లింపు పద్ధతుల్లో ‘బై నౌ, పే లేటర్‌’(ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి) విధానానికి భారీ ఆదరణ లభిస్తోందని పేర్కొంది. డిజిటల్‌ వాలెట్ల ద్వారా జరుగుతున్న చెల్లింపులు 2024 నాటికి 47 శాతానికి పుంజుకోనున్నాయని అంచనా వేసింది.

ఇక దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీవోఎస్‌) చెల్లింపు విధానానికి ప్రాచుర్యం లభిస్తోందని.. దీని మార్కెట్‌ 2024 నాటికి 41 శాతం పెరిగి 1,035 బిలియన్‌ డాలర్లకు చేరనుందని నివేదిక తెలిపింది. ఇక ఇప్పటికీ 34 శాతం మంది నేరుగా నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నట్లు తేలింది. తర్వాత డిజిటల్‌ వాలెట్‌ ద్వారా 22 శాతం, డెబిట్‌ కార్డ్‌ ద్వారా 22 శాతం మంది చెల్లిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

ఇవీ చదవండి..

కార్లు ముందుకు..బైకులు వెనక్కి

ఏప్రిల్‌-జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని