Recession: జర్మనీలో ఆర్థిక మాంద్యం.. భారత్‌పై ప్రభావమెంత?

Recession: వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధి రేటులో క్షీణత నమోదైన నేపథ్యంలో జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం భారత ఎగుమతులపై పడుతుందని నిపుణులు తెలిపారు.

Published : 26 May 2023 18:10 IST

దిల్లీ: జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి (Germany Recession) జారుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం భారత్‌పై కూడా పడనుంది. మన దేశం నుంచి ఐరోపాకు అయ్యే ఎగుమతుల్లో కోత పడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. జర్మనీలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) 0.3 శాతం పడిపోయింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5 శాతం క్షీణత కనిపించింది. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా (Recession) నిర్వచిస్తారు.

ఒక్క జర్మనీకే కాకుండా మొత్తం ఐరోపా దేశాలకు భారత్‌ నుంచి అయ్యే ఎగుమతులపై ప్రభావం పడుతుందని ముంబయికి చెందిన ప్రముఖ ఎగుమతిదారు, టెక్నోక్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ శరద్‌ కుమార్‌ సరఫ్‌ తెలిపారు. 2022- 23లో జర్మనీకి భారత్‌ నుంచి 10.2 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎగుమతులు నమోదైనట్లు వెల్లడించారు. తాజా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ విలువ పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తోలు ఉత్పత్తులు, కెమికల్‌, లైట్‌ ఇంజినీరింగ్‌ వస్తువులపై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.

దాదాపు రెండు బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చని జీటీఆర్‌ఐ సహ- వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. రోజువారీ వినియోగించే వస్తువులపై మాంద్యం సమయంలో అధిక ప్రభావం ఉంటుందని తెలిపారు. మరోవైపు త్వరలో అమల్లోకి రానున్న కార్బన్‌ బార్డర్‌ ట్యాక్స్‌ వల్ల ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఉంటుందన్నారు.

మాంద్యం వల్ల జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే దుస్తుల ఆర్డర్లు తగ్గుతాయని ‘అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌’ ఛైర్మన్‌ నరేంద్ర గోయెంకా తెలిపారు. దాదాపు 10 శాతం క్షీణత కనిపించొచ్చని అంచనా వేశారు. జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే పెట్టుబడులు సైతం తగ్గుతాయన్నారు. అయితే, పెట్టుబడుల విషయంలో శరద్‌ కుమార్‌ సరఫ్‌ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో జర్మనీ తొమ్మిదో అతిపెద్ద పెట్టుబడిదారని తెలిపారు. మాంద్యం వల్ల అక్కడి కంపెనీలు చౌక ప్రత్యామ్నాయాల కోసం శోధిస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే పెట్టుబడులు తగ్గకపోవచ్చునని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని