IIBX: తొలి అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించిన మోదీ.. దీనివల్ల ప్రయోజనం ఏమిటి?

భారత తొలి బులియన్‌ ఎక్స్ఛేంజ్‌- ‘ఇండియా ఇంటర్నేషన్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ (IIBX)’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు....

Updated : 29 Jul 2022 18:15 IST

అహ్మదాబాద్‌: భారత తొలి బులియన్‌ ఎక్స్ఛేంజ్‌- ‘ఇండియా ఇంటర్నేషన్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ (IIBX)’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటిలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. 2020 కేంద్ర బడ్జెట్‌లో దీని ఏర్పాటుపై సర్కార్‌ ప్రకటన చేసింది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇప్పటికే ఎక్స్ఛేంజ్‌లో వర్తకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలాగే భౌతిక బంగారం, వెండిని నిల్వ చేయడానికి కావాల్సిన మౌలికవసతులనూ ఏర్పాటు చేశారు.

బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ అంటే..

నాణేలు, బిళ్లలు, కడ్డీల రూపంలో ఉండే అత్యంత స్వచ్ఛతతో కూడిన భౌతిక బంగారం, వెండిని బులియన్‌ (Bullion)గా వ్యవహరిస్తారు. సంస్థాగత మదుపర్లు, కేంద్ర బ్యాంకులు వీటిని నిల్వ చేస్తుంటాయి. కొనుగోలు, అమ్మకందారులు బంగారం, వెండితో పాటు సంబంధిత డెరివేటివ్‌ల వర్తకం చేయడానికి ఉపయోగించే వేదికే బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ (Bullion Exchange). స్టాక్‌ మార్కెట్లను సెబీ నియంత్రిస్తున్నట్లుగానే తాజాగా భారత్‌లో ఏర్పాటు చేసిన ఈ IIBX.. ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (IFSCA)’ నియంత్రణలో ఉంటుంది.

ఐఐబీఎక్స్‌లో ఎలా పనిచేస్తుంది?

రిజిస్టర్‌ చేసుకున్న నగల వ్యాపారులు, వర్తకులు ఎక్స్ఛేంజీ నుంచి భౌతిక బంగారం, వెండిని కొనుగోలు చేయొచ్చు. అర్హతగల వ్యాపారులకు మాత్రమే ఐఐబీఎక్స్‌ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అర్హతగల వ్యాపారులంటే.. వారి సంస్థల కనీస నికర సంపద రూ.25 కోట్లుగా ఉండాలి. అలాగే గత మూడేళ్ల సగటు వార్షిక టర్నోవర్‌లో 90 శాతం.. విలువైన లోహాల వ్యాపారం వల్ల ఆర్జించి ఉండాలి. ఎంపిక చేసిన బ్యాంకులు, ఏజెన్సీల ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన సరళీకరణల్ని 1990ల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇలా అర్హతగల నగల వ్యాపారులు నేరుగా IIBX ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం ఇదే తొలిసారని IFSCA తెలిపింది. 

ప్రవాస భారతీయులు, సంస్థలు కూడా IIBXలో ట్రేడ్‌ చేసేందుకు అనుమతి ఉంది. అయితే, వారు IFSCAలో నమోదై ఉండాలి. రానున్న రోజుల్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటి ఫండ్లు కూడా దీనిలో భాగస్వామ్యమయ్యేందుకు అవకాశం కల్పించవచ్చని నిపుణులు తెలిపారు. ఏయే ఉత్పత్తులు, ఎంత మొత్తంలో, వాటి విలువ, దిగుమతి అయిన బంగారం వంటి వివరాలతో కూడిన బులియన్‌ లావాదేవీల సమాచారాన్ని ప్రతినెలా IFSCAకు IIBX అందజేస్తుంది.

ఇప్పటి వరకు ఎంత మంది రిజిస్టర్‌ అయ్యారు?

మొత్తం 56 మంది అర్హతగల నగలవ్యాపారులు IIBXలో నమోదు చేసుకున్నారు. వీటిలో మలబార్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, టైటన్‌ కంపెనీ లిమిటెడ్‌, బెంగళూరు రిఫైనరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్‌బీజెడ్‌ జెవెల్లర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జవేరీ అంట్‌ కంపెనీ లిమిటెడ్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే బంగారం దిగుమతులకు సంబంధించి IIBXలో ట్రయల్‌ ట్రాన్సాక్షన్స్‌ ప్రారంభమయ్యాయి. 

గిఫ్ట్‌ సిటీలో ఎంత బంగారాన్ని నిల్వ చేయొచ్చు?

దాదాపు 125 టన్నుల బంగారం, 100 టన్నుల వెండిని నిల్వ చేసేందుకు గిఫ్ట్‌ సిటీలో వసతులు ఏర్పాటు చేశారు. దానికి కావాల్సిన మౌలిక వసతులను భారత్‌ సహా కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అందించాయి. ఇంకా కొంత పని పూర్తి చేయాల్సి ఉంది. పండగల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దిగుమతి చేసుకునే వారి కోసం ఎక్స్ఛేంజీలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

995 స్వచ్ఛత గల 1 కేజీ బంగారం, 999 స్వచ్ఛత గల 100 గ్రాముల బంగారం తొలుత IIBXలో ట్రేడ్‌ కానున్నాయి. ప్రస్తుతానికి లావాదేవీ జరిగిన రోజే దాన్ని సెటిల్‌ చేసేస్తారు. తర్వాత దీన్ని టీ+2.. అంటే ఆర్డర్‌ ఎగ్జిక్యూట్‌ అయిన రెండు రోజుల తర్వాత ఫండ్స్‌ను సెటిల్‌ చేస్తారు. యూఏఈ గోల్డ్‌, 12.5 కిలోల పెద్ద బంగారు కడ్డీలు కూడా భవిష్యత్తులో ట్రేడ్‌ కావొచ్చని అంచనా. తర్వాతి దశల్లో వెండిని కూడా ట్రేడ్‌ చేయనున్నట్లు సమాచారం.

బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ వల్ల భారత్‌కు ప్రయోజనమేంటి?

భారత్‌లోకి వచ్చే బులియన్‌ దిగుమతులకు IIBX ప్రధాన కేంద్రంగా మారనుంది. దేశీయ వినియోగానికి కావాల్సిన బులియన్‌ మొత్తాన్ని ఈ మార్గంలోనే దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఐబీఎక్స్‌ వల్ల వర్తకులకు ఒక అధీకృత వేదిక లభించడంతో పాటు విలువైన లోహాల నాణ్యతకు భరోసా లభిస్తుంది. అలాగే, ధర, లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. పైగా వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని అందించే సరఫరాదారులకు ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD)’ నియమాలను తప్పనిసరి చేయడం వల్ల IIBX ద్వారా డెలివరీ చేసే బులియన్‌కు భరోసా ఉంటుందని IFSCA తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని