Inflation: ప్రజలపైకి ‘ద్రవ్యోల్బాణం’

అదిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, భారత్‌.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక; అభివృద్ధి చెందిన - చెందుతున్న దేశాలనే తారతమ్యం లేదు. ఏ దేశంలో

Updated : 02 Jul 2022 09:40 IST

ప్రతి ఇంటా.. ధరల మంట
ఏం కొందామన్నా మోయలేనంత భారం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను  సవాలు
అమెరికా, భారత్‌ సహా చాలా దేశాల్లో అతిపెద్ద సమస్య

గన్నవరపు సుబ్బారావు
ఈనాడు, బిజినెస్‌ బ్యూరో

దిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, భారత్‌.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక; అభివృద్ధి చెందిన - చెందుతున్న దేశాలనే తారతమ్యం లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. చైనా, జపాన్‌, సౌదీ అరేబియా..వంటి కొన్ని దేశాలే ఇందుకు మినహాయింపు. మిగతా దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో వ్యవస్థలోకి విడుదల చేసిన అధిక ద్రవ్యాన్ని ఉపసంహరిస్తూ, వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ఖర్చులు భరించలేక అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అభివృద్ధి చెందిన 44 దేశాలను పరిశీలిస్తే అందులోని 37 దేశాల్లో ద్రవ్యోల్బణం గత రెండేళ్లలోనే రెట్టింపయ్యింది.

అగ్రరాజ్యం అప్రమత్తం

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయులకు చేరి, కొన్ని నెలలుగా 8 శాతానికి పైనే నమోదవుతోంది. అమెరికా ప్రజలు గ్యాసోలిన్‌, నిత్యావసరాలకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. గ్యాసోలిన్‌, డీజిల్‌పై ఫెడరల్‌ పన్నులను 3 నెలలు వాయిదా వేయాలని అధ్యక్షుడు బైడెన్‌ ఇటీవల కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడరల్‌ రిజర్వ్‌) కీలక వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టి, ఉద్దీపన పథకాల్లో కోత అమలు చేస్తోంది. ఇందువల్ల ఏడాది-రెండేళ్లలో మాంద్యం చోటుచేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

యూకేలోనూ ఇంతే

యూకేలోనూ ద్రవ్యోల్బణం గత నెలలో 9.1 శాతానికి చేరుకుంది. ఇది 40 ఏళ్ల గరిష్ఠం. తినుబండారాలు, పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ముఖ్య ఆర్థిక వేత్త గ్రాంట్‌ ఫిట్జర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి 11 శాతానికి చేరుకుంటుందని అంచనా. దీంతో బ్రిటన్‌ ప్రజల కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే అక్కడ అధిక ధరలకు తోడు నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి పరిస్థితులే ఇతర ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ.. తదితర దేశాల్లోనూ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రష్యాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశంలో ఇది గత నెలలో 17.1 శాతంగా నమోదైంది.

శ్రీలంక మాదిరిగా మరికొన్ని దేశాలు

మన పొరుగు దేశమైన శ్రీలంకలో అయితే ఏరోజుకారోజు పెట్రోలు, నిత్యావసరాల కోసం ప్రజలు వెతుక్కుంటున్నారు. విదేశీ మారకద్రవ్యం రూపేణా అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వైపు చూస్తోంది శ్రీలంక ప్రభుత్వం. ఆ దేశానికి 51 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్ల) విదేశీ అప్పు పేరుకుపోయింది. కరోనా పరిణామాలతో పర్యాటకుల రాక క్షీణించడం, అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆ దేశ పాలకుల స్వయంకృతం మరికొంత కారణం. భారతదేశం ఇస్తున్న రుణంతో ఆ దేశం ఎంతో కష్టంగా రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితులే పాకిస్థాన్‌, నేపాల్‌లలోనూ కనిపిస్తున్నాయి. లెబనాన్‌, సూడాన్‌, వెనెజువెలా దేశాల్లో ద్రవ్యోల్బణం 200 శాతానికి మించింది. ఆ దేశాల్లో ఇప్పుడు కరెన్సీ విలువ నామమాత్రమే. ఆసియా- ఐరోపా ఖండాల మధ్య వారధిగా ఉండే తుర్కియే(ఇంతక్రితం టర్కీ) నాటో సభ్య దేశం. నిర్మాణ రంగం, వాహన పరిశ్రమలు, పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గానే ఉండేవి. మే నెలలో ద్రవ్యోల్బణం 73.5 శాతానికి చేరి ఆ దేశమూ తల్లడిల్లిపోతోంది.

మనదేశంలో

భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 7.8 శాతానికి చేరినా, మేలో 7.04 శాతానికి దిగివచ్చింది. ఇప్పటికిప్పుడు 6 శాతం కంటే దిగువకు వచ్చే పరిస్థితి లేదు. ఆర్బీఐ ద్రవ్య పరపతి చర్యల మీదే ఆధారపడకుండా, ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తేనే ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అన్ని ధరలూ పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణించడం ఆందోళనకర పరిణామం. జింబాబ్వే, టునీసియా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాల్లో ప్రజల ఆందోళనను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. అఫ్గానిస్థాన్‌, యెమెన్‌, హైతీ వంటి పేద దేశాల్లో తీవ్ర ఆహార కొరత కనిపిస్తోంది.

ఇప్పట్లో దిగివస్తుందా!

మనదేశం, అమెరికా, ఐరోపా దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. వ్యవస్థలో నగదు లభ్యతను తగ్గించే చర్యలపై దృష్టి సారించాయి. చమురు ధరల మంట 2-3 నెలల్లో చల్లారుతుందని అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఈ సంవత్సరాంతానికి ధరలు తగ్గి ద్రవ్యోల్బణం దిగిరావచ్చు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగియకుండా చమురు ధరలు బాగా తగ్గడం సాధ్యం కాదు. అందువల్ల స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగానే ఉంటుందని, ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని స్పష్టమవుతోంది.

ఇవీ ప్రధాన కారణాలు...

అధిక ద్రవ్యోల్బణ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దాదాపు రెండేళ్ల పాటు కొవిడ్‌ కేసుల విస్తృతిని తగ్గించేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌తో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీని వల్ల వాణిజ్య కార్యకలాపాలు క్షీణించి, వస్తూత్పత్తి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఉద్దీపన పథకాలను (అర్థశాస్త్ర పరిభాషలో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటారు) పెద్దఎత్తున అమలు చేశాయి. దీంతో వ్యవస్థలోకి నగదు సరఫరా పెరిగింది. కరోనా కష్టాల నుంచి ప్రపంచ దేశాలు గట్టెక్కుతున్న తరుణంలోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. దీనివల్ల ముడి చమురు ధరల మంట తీవ్రమైంది. లోహాలు, గ్యాస్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

అధిక ద్రవ్యోల్బణంతో పెరిగిపోతున్న ధరలను తట్టుకోలేక పలు దేశాల్లో ప్రజలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత వారం, పది రోజుల్లో పాకిస్థాన్‌, బెల్జియం, బ్రిటన్‌, ఈక్విడార్‌, అమెరికా దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెరూలో ప్రజాందోళనను కట్టడి చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

మనదేశంలో ద్రవ్యోల్బణం 4 (+/- 2) శాతం ఉండాలనేది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం. అంటే 2-6 శాతం మధ్య ఉండాలి. 6 శాతానికి మించితే అభివృద్ధి మందగిస్తుందన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. కానీ గత ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఇది 6 శాతం కంటే పైనే నమోదైంది.

వెనెజువెలా చమురు అధికంగా ఎగుమతి చేస్తూ ఎంతో సంపన్న దేశంగా ఉండేది. ఆ దేశ పాలకులు సంపద సృష్టిని విస్మరించి, ‘ఉచితాల’తో ప్రజలను ముంచెత్తి, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయేలా చేశారు. దీంతో ఆర్థికంగా ఆ దేశం దివాలా తీసిన చందాన తయారైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని