I T portal: ఐటీ పోర్టల్లో లోపాలు..!
ఆదాయపు పన్ను శాఖ వెబ్పోర్టల్లో లోపాలు ఉన్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గుర్తించిందని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ
పరిష్కరిస్తామన్న ఆర్థికశాఖ
ఇంటర్నెట్డెస్క్: ఆదాయపు పన్ను శాఖ వెబ్పోర్టల్లో లోపాలు ఉన్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గుర్తించిందని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పార్లమెంట్కు తెలిపారు. నిదానంగా పనిచేయడం, చాలా సందర్భాల్లో కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారు. www.incometax.gov.in వెబ్పోర్టల్ను ప్రభుత్వం జూన్ 7వ తేదీ ప్రారంభించింది. మొదటి నుంచి దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నట్లు పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు, ఇతర వర్గాల వారు ఫిర్యాదులు చేశారు. దీనిని పరిష్కరించేందుకు జూన్ 22న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెబ్సైట్ను తయారు చేసిన ఇన్ఫోసిస్ సిబ్బందితో భేటీ అయ్యారు.
ఈ అంశంపై రాజ్యభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ వెబ్పోర్టల్లో 2,000 లోపాలు ఉన్నట్లు తమకు 700 ఈమెయిల్స్ వచ్చాయన్నారు. వీటిల్లో 90 కొత్త రకం సమస్యలు ఉన్నట్లు చెప్పారు. ‘‘ఇన్ఫోసిస్ ఈ వెబ్పోర్టల్లోని సమస్యలను గుర్తించింది. అవి సాంకేతిక సమస్యలే అని పేర్కొంది. వాటిని నిరంతరం పరిష్కరిస్తోంది. నిదానంగా పనిచేయడం, కొన్ని సేవలు అందుబాటులో ఉండకపోవడం వంటి వాటిని నివారిస్తాము’’ అని ఆయన పేర్కొన్నారు. దీనిని వినియోగించేవారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పోర్టల్ తయారీ కాంట్రాక్ట్ ఇన్ఫోసిస్కు 2019లో దక్కింది. ఆదాయపు పన్ను రిటర్నులు ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించేందుకు దీనిని చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.