Infosys: ఇన్ఫోసిస్‌ సీఈఓ జీతం.. రూ.71కోట్లు

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.71.02కోట్లు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ వేతనం 43 శాతం పెరిగింది. ఈ మేరకు

Published : 26 May 2022 17:48 IST

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.71.02కోట్లు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ వేతనం 43 శాతం పెరిగింది. ఈ మేరకు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక జీతం రూ.49కోట్లుగా ఉంది.

కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ సలీల్‌ పరేఖ్‌ రూ.71.02 కోట్లు టేక్‌హోం జీతంగా అందుకున్నారు. ఇందులో రూ.5.69కోట్లు బేస్‌ శాలరీ కాగా.. రూ.12.62 కోట్లు వేరియబుల్‌ పే, రూ.52.33కోట్ల స్టాక్‌ ఆప్షన్ల రూపంలో తీసుకున్నారు. ఇక మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇతరత్రా కలిపి గత ఆర్థిక సంవత్సరంలో పరేఖ్‌ అందుకున్న మొత్తం రూ.79కోట్లు అని కంపెనీ వెల్లడించింది. పరేఖ్ నేతృత్వంలో ఇన్ఫోసిస్‌ గత కొన్నేళ్లుగా వేగంగా వృద్ధి చెందిందని, అందుకే ఆయన వేతనాన్ని పెంచినట్లు కంపెనీ తెలిపింది.

కాగా.. దేశంలోనే అత్యంత ఎక్కువ వేతనం అందుకుంటున్న ఐటీ కంపెనీ సీఈఓ పరేఖ్‌ కావడం విశేషం. ఇన్ఫోసిస్‌ ప్రధాన పోటీ సంస్థ అయిన టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథ్‌ వార్షిక వేతనం రూ.25.76కోట్లు మాత్రమే. ఇక విప్రో సీఈఓ రూ.64.34కోట్లు, హెచ్‌సీఓల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ రూ.32.21కోట్లు, టెక్‌ మహీంద్రా సీఈఓ రూ.22కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు.

మరోవైపు, ఇటీవలే సలీల్‌ పరేఖ్‌ పదవీ కాలాన్ని కూడా ఇన్ఫోసిస్‌ పొడిగించిన విషయం తెలిసిందే. మరో ఐదేళ్ల పాటు అంటే 2027 మార్చి 31వరకు ఆయన కంపెనీ సీఈఓగా కొనసాగుతారని ఇన్ఫీ ప్రకటించింది. వ్యవస్థాపక సభ్యులు కాకుండా వరుసగా రెండోసారి కంపెనీ సీఈఓగా ఎంపికైన తొలి వ్యక్తిగా సలీల్‌ గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ నందన్‌ నీలేకని కంపెనీకి తాను అందించే సేవలకు గానూ ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోబోనని ఇటీవల స్వచ్ఛందంగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని