Intel: లేఆఫ్‌లకు బదులుగా.. ఇంటెల్‌ కీలక నిర్ణయం!

కొద్దినెలలుగా ఇంటెల్‌ మార్కెట్‌ వాటా తగ్గుతూ వస్తోన్న నేపథ్యంలో మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో దాదాపు 20 శాతం మంది సిబ్బందిని తొలగించనుందనే వార్తలు వెలువడ్డాయి. వాటిని భిన్నంగా ఇంటెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 02 Feb 2023 01:18 IST

కాలిఫోర్నియా:  మాంద్యం భయాల (Recession)తో ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు (IT Companies) ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. యాపిల్  (Apple)మినహా అన్ని దిగ్గజ ఐటీ సంస్థలు లేఆఫ్‌ (Layoffs)లు ప్రకటించాయి. ఈ కంపెనీలకు భిన్నంగా మరో టెక్‌ దిగ్గజ సంస్థ ఇంటెల్‌ ( Intel) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించిననున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఇంటెల్‌ తెలిపింది. 

ఇంటెల్‌ తాజా నిర్ణయంలో భాగంగా సంస్థ సీఈవో పాట్‌ గెల్‌సింగర్‌కు  25 శాతం, ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు ఐదు శాతం కోత విధించనున్నట్లు తెలిపింది. ‘‘ ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీతభత్యాల్లో కోత విధించాలని నిర్ణయించాం. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహదపడుతుంది’’ అని ఇంటెల్‌ పేర్కొంది. 

కొన్నేళ్లుగా పీసీ చిప్‌ మార్కెట్‌లో ఇంటెల్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో కంపెనీ అమ్మకాలు నెమ్మదించాయి. మరోవైపు చిప్‌సెట్ రంగంలో ఏఎమ్‌డీ (AMD) కంపెనీ నుంచి ఇంటెల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో కొద్దినెలలుగా ఇంటెల్‌ మార్కెట్‌ వాటా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో దాదాపు 20 శాతం మంది సిబ్బందికి ఉద్వాసన పలికే అవకాశం గతేడాది చివరల్లో వార్తలు వెలువడ్డాయి. వాటికి భిన్నంగా ఇంటెల్‌ ఉద్యోగుల  జీతాల్లో కోత  విధించాలని నిర్ణయించింది. మరోవైపు యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ సైతం తన జీతంలో 40 శాతం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని