పాటిద్దాం.. ఈ పెట్టుబడి సూత్రాలు

ఆర్థిక లక్ష్యాల సాధనలో పెట్టుబడులు ఎంతో కీలకం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాన్ని చేరుకునేందుకు ఏం చేయాలనే ప్రణాళిక ఉండాల్సిందే.

Updated : 10 Mar 2023 03:17 IST

ఆర్థిక లక్ష్యాల సాధనలో పెట్టుబడులు ఎంతో కీలకం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాన్ని చేరుకునేందుకు ఏం చేయాలనే  ప్రణాళిక ఉండాల్సిందే. అదే సమయంలో కొన్ని సూత్రాలూ పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అనుకున్న ఆర్థిక గమ్యాన్ని చేరుకునేందుకు మార్గం దొరుకుతుంది. ఆ సూత్రాలేమిటో చూద్దామా..

వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక ముఖ్యమైన అంశం. వ్యక్తులు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వివిధ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు మొదలైన వాటి ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల మధ్య వ్యత్యాసం ఉండాలి. అప్పుడే వీటిని సాధించే క్రమంలో స్పష్టమైన మార్గాలను రూపొందించుకునేందుకు వీలవుతుంది. అదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌ పనితీరును కచ్చితంగా అంచనా వేయలేమనే సంగతినీ గుర్తించాలి. మార్కెట్‌ పనితీరును పట్టించుకోకుండా, వీలైనంత తొందరగా పెట్టుబడిని ప్రారంభించాలి. దీర్ఘకాలంపాటు ఓపిగ్గా ఎదురు చూసిన వారికి మార్కెట్‌ ఎప్పుడూ సానుకూల ఫలితాలనే అందిస్తుంది.

వేర్వేరు పథకాల్లో...: ఒకటే తరహా పెట్టుబడి పథకాల్లో మదుపు చేయడం వల్ల ఎప్పుడూ సమస్యలుంటాయి. లక్ష్యం, పెట్టుబడి వ్యవధి తదితరాల ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవాలి. లక్ష్య ఆధారిత పెట్టుబడులు కొత్త అంశమేమీ కాదు. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలతో నేరుగా అనుసంధానమయ్యే ఉత్పత్తులను చూడాలి. అప్పుడే పెట్టుబడి ప్రణాళిక విజయవంతం అవుతుంది. నష్టభయమూ తగ్గుతుంది. మంచి రాబడిని ఆర్జించేందుకూ వీలవుతుంది. విభిన్న పెట్టుబడి పథకాలతోపాటు, భౌగోళిక ప్రాంతాలనూ ఎంచుకోవడం చాలా కీలకం. పెట్టుబడి పథకాలను వృద్ది, నాణ్యత, విలువ ఆధారంగా వర్గీకరించాలి. ఫలితంగా మార్కెట్లో ఉన్న బహుళ అవకాశాలను వినియోగించుకునేందుకు వీలవుతుంది.

నాణ్యతను పట్టించుకోండి..: పెట్టుబడులు పెట్టేందుకు ఎంచుకునే పథకాలు, కంపెనీలు నాణ్యమైనవి అయి ఉండాలి. భవిష్యత్తును అంచనా వేస్తూ మదుపు కొనసాగించాలి. ప్రస్తుత స్థూల ఆర్థిక సూచీలను దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక దృష్టితో స్థిరమైన వృద్ధి, నగదు ప్రవాహం అధికంగా ఉండటంలాంటి కంపెనీల్లో ‘ఫండమెంటల్స్‌’ ఆధారంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. సంపద సృష్టిలో బాటమ్‌-అప్‌ వ్యూహం ఎంతో కీలకం.

అత్యవసరం - పదవీ విరమణ...: అత్యవసర పరిస్థితులు మనకు తెలియకుండానే వస్తాయి. కాబట్టి, దీనికి సిద్ధంగా ఉండాల్సిందే. అందుకు అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలి. వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న పథకాల్లో ఈ మొత్తాన్ని మదుపు చేయాలి. అత్యవసర నిధి ఉంటే.. ఆర్థిక సంక్షోభ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం లేదా అప్పులు చేయడంలాంటి అవసరాలను తప్పిస్తుంది. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మలి వయసులో ఆర్థిక స్వేచ్ఛ సాధించేందుకు వీలవుతుంది. లేకపోతే విశ్రాంత   జీవితంలో చిక్కులు తప్పవు.

సూచీల ఆధారంగా...: ఇటీవల కాలంలో భారతీయ మదుపరులు సూచీ ఆధారిత పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. సూచీల వృద్ధిని ఈ తరహా పెట్టుబడులు ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాకుండా విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు వీలవుతుంది. ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్ల ద్వారా ఈ పాసివ్‌ పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. పెట్టుబడిదారుల ఇష్టాన్ని బట్టి, విభిన్నమైన సూచీల ఫండ్లలో మదుపు చేసుకోవచ్చు.

భావోద్వేగాలు వద్దు..: మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్‌ స్పందిస్తుంది. ఒక సమాచారం వచ్చినప్పుడు కొన్ని షేర్ల ధరలు పడిపోతుంటాయి. వెంటనే మదుపరులు వాటిని అమ్మేస్తుంటారు. లేదా పెరుగుతుంటే కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రెండూ సరికాదు.

‘అనుభవమే ఉత్తమ గురువు’.. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. పెట్టుబడి మార్గాలను అర్థం చేసుకోవడం, వాటిని ఎంపిక చేసుకోవడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. అప్పుడే మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము, మీ కోసం కష్టపడటం ప్రారంభిస్తుంది. అవసరమైనప్పుడు ఆర్థిక నిపుణుల సలహాలూ తీసుకోండి.

రాఘవ్‌ అయ్యంగార్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, యాక్సిస్‌ ఏఎంసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని