China: ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పిన ఫాక్స్‌కాన్

యాపిల్‌ ఫోన్ల తయారీలో ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్లాంట్లలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పలు వీడియోలు వెలుగులో వచ్చాయి. దీనిపై ఫాక్స్‌కాన్‌ స్పందించింది. 

Updated : 24 Nov 2022 12:10 IST

బీజింగ్: చైనాలోని యాపిల్‌ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్లాంట్లలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పలు వీడియోలు వెలుగులో వచ్చాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తమ వసతిగృహాల నుంచి బుధవారం వేకువజామున కార్మికుల ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. దీనిపై ఫాక్స్‌కాన్‌ క్షమాపణలు తెలియజేసింది. 

దాదాపు నెలన్నర క్రితం కొవిడ్‌ లాక్‌డౌన్లకు భయపడి అనేక మంది సిబ్బంది జెంగ్‌ఝౌ ప్లాంట్‌ నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాంటులో దాదాపు రెండు లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది బయటకు వెళ్లిపోవడంతో.. కంపెనీ భారీ ఎత్తున కొత్త సిబ్బందిని నియమించుకుంది. తాజాగా వీరే ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. నెలక్రితం ఉద్యోగం చేరిన తమని అసలు బయటకు అనుమతించడం లేదని.. పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

ఇప్పుడు దీనిపై ఫాక్స్‌కాన్‌ సంస్థ స్పందించింది. ‘ఈ ఘటనపై మా బృందం విచారణ జరుపుతోంది. కొత్త సిబ్బంది నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ప్రస్తుత ఘటనకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మొదట చెప్పిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తాం’ అని పేర్కొంది. 

కొసమెరుపు..

‘‘పరిశ్రమలను చైనా నుంచి తరలించాలని తయారీ సంస్థలు యోచిస్తే మనకు ప్రమాదం లాంటిదే. ఇక్కడ స్థిరమైన లేబర్ మార్కెట్‌తో చైనా అతిపెద్ద తయారీదారుగా ఉంది. ఐఫోన్‌ ఉత్పత్తుల తయారీని భారత్‌కు తరలించినందుకు ఫాక్స్‌కాన్‌ యాజమాన్యం చింతిస్తుందా..?’’ అంటూ 2020 డిసెంబర్‌లో గ్లోబల్‌ టైమ్స్ పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. బెంగళూరులోని ఐఫోన్‌ ఉత్పత్తుల సరఫరాదారు విస్ట్రన్‌లో జరిగిన ఆందోళనను ప్రస్తావిస్తూ ఆమె ఈ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. అధిక పనిగంటలు, జీతాలు వంటి అంశాలపై అప్పట్లో నిరసనలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. చైనాలో కనీస సదుపాయాలు లభించక  అక్కడి ఐఫోన్‌ కర్మాగారంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.


చైనాలో రికార్డు స్థాయి కేసులు

జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న చైనాను కరోనా మహమ్మారి వదలడం లేదు. మరోమారు అక్కడ రికార్డు స్థాయిలో 30 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. 

గురువారం వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం.. దేశీయంగా 31,454 కొత్త కేసులు వచ్చాయి. అందులో 27,517 కేసుల్లో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. 140 కోట్ల జనాభా కలిగిన ఆ దేశంలో ఈ స్థాయి కేసులు తక్కువనే చెప్పుకోవచ్చు. కానీ, కఠిన క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తోంది. దాదాపు మూడేళ్లుగా ఈ నిబంధనల చట్రంలో మగ్గుతున్న ప్రజలు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని