IRCTC: త్వరలో పెంపుడు జంతువులకు రైలు టికెట్‌.. ఎలా చేసుకోవాలంటే?

రైలు ప్రయాణాల్లో (Train Journey) పెంపుడు జంతువులను (PETS) తమతోపాటు తీసుకెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పలు చేయాలని రైల్వే మంత్రిత్వశాఖ సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS)కు సూచించింది.

Published : 05 May 2023 22:37 IST

దిల్లీ: పెంపుడు జంతువులు (Pets) ఉన్నవారు వాటిని తమతోపాటు దూర ప్రయాణాలకు తీసుకెళ్లాలంటే కాస్త ఇబ్బందే. సొంత వాహనం ఉంటే ఎలాగో తీసుకెళ్లొచ్చు. అదే, ప్రజా రవాణా వ్యవస్థలో (Public Transport) అయితే.. ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందే.  ఈ సమస్యకు పరిష్కారంగానే ఐఆర్‌సీటీసీ (IRCTC) కొత్త సదుపాయాన్ని తీసుకురానుంది. ఇకపై రైలు ప్రయాణాల్లో (Train Journey) తమతోపాటు పెంపుడు జంతువులకు తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీఈ (TTE)లు పెంపుడు జంతువులకు టికెట్‌ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. 

ఇప్పటి వరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్‌ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేషన్‌లోని పార్శిల్‌ కౌంటర్‌కు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్ బుక్‌ చేసుకోవాలి. అలానే, సెకండ్‌ క్లాస్‌ లగేజ్‌ లేదా బ్రేక్‌ వ్యాన్‌లో ఒక బాక్స్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ఈ వ్యవహారం మొత్తం ప్రయాణికులు ఇబ్బందికరంగా ఉండటంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని రైల్వేశాఖ సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS)కు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ఈ నిబంధన ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తిస్తుందని సమాచారం. వీటిలో పిల్లులు, కుక్కలను ప్రయాణికులు తమతోపాటు తీసుకెళ్లవచ్చు. ఏనుగులు, గుర్రాలు వంటి పెద్ద జంతువులను గూడ్స్‌ రైల్లో మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటితోపాటు ఒక వ్యక్తి ప్రయాణించాలి. ప్రయాణ సమయంలో వాటి నిర్వహణ బాధ్యత యజమానులదే. రైల్లో ప్యాసింజర్‌ టికెట్‌ కన్ఫర్మేషన్‌ అయితేనే పెంపుడు జంతువుల కోసం టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. అది కూడా మొదటి ఛార్ట్ ప్రిపేర్‌ అయిన తర్వాత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్ కొనుగోలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీటీఈలకు కూడా టికెట్‌ కేటాయింటే అధికారం ఉంటుందని తెలిపారు. టికెట్‌ తీసుకున్న పెంపుడు జంతువులను గార్డ్‌ కోసం కేటాయించిన ఎస్‌ఎల్‌ఆర్‌ (SLR) కోచ్‌లో ఉంచుతారు.  రైలు ఆగినప్పుడు యజమానులు వాటికి ఆహారం, నీరు ఇతరత్రాలను అందజేయొచ్చు. ఒకవేళ ప్రయాణికులు ఏదైనా కారణంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే పెంపుడు జంతువు కోసం కొనుగోలు చేసిన టికెట్‌ మొత్తం తిరిగి చెల్లించరు. అలానే, రైలు రద్దైనా, మూడు గంటలు కంటే ఎక్కువ సమయం ఆలస్యమైనా పెంపుడు జంతువుల టికెట్‌ మొత్తం రిఫండ్‌ కాదని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని