IT Returns: ఆదాయం లేకున్నా రిటర్నులు దాఖలు చేయాలా?

అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు వ్యక్తులు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి.

Published : 02 Jun 2023 00:05 IST

నేను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. మరి దీనికి సమాధానం ఏమిటి? తెలుసుకుందాం

అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు వ్యక్తులు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి.   వేతనం, బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ, డివిడెండ్‌, అద్దె ద్వారా ఆదాయంలాంటి వాటిని ఒక చోట చేర్చాలి.     26 ఏఎస్‌ లేదా ఏఐఎస్‌ను గమనిస్తే వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయాలు తెలుస్తాయి. వివిధ సెక్షన్ల కింద అంటే సెక్షన్‌ 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ, 80టీటీఏ తదితరాలకు ముందున్న ఆదాయం ఎంతో చూడాలి.
* 60 ఏళ్ల లోపు వారికి ప్రాథమిక మినహాయింపు రూ.2.50 లక్షలు. 60-80 ఏళ్ల వారికి రూ.3లక్షలు. 80 ఏళ్లపైన ఉన్న వారికి రూ.5లక్షల వరకూ పన్ను వర్తించదు. పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను, పన్ను వర్తించే ఆదాయం ఈ పరిమితి లోపే ఉంటుంది. రూ.5 లక్షల లోపు పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడు సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేటు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, వర్తించే ఐటీఆర్‌ ఫారంలో రిటర్నులు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుంది.
* విదేశాల్లో ఉన్న ఆస్తి నుంచి లాభాలు ఆర్జించినప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోయినా రిటర్నులు తప్పవు. దేశం వెలుపల నిర్వహించిన ఏదైనా ఆర్థిక లావాదేవీలో మీరు భాగం పంచుకున్నప్పుడు, బ్యాంకు ఖాతాలు ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
* విదేశీ కంపెనీల షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లలో మదుపు చేసిన వారూ రిటర్నులు తప్పనిసరిగా సమర్పించాలి.
* అన్ని కరెంటు ఖాతాల్లో రూ. కోటి, అన్ని పొదుపు ఖాతాల్లో రూ.50 లక్షలకు మించి నగదు డిపాజిట్‌ చేసినప్పుడు ఐటీఆర్‌ దాఖలు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది.
* ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం నుంచి మినహాయించిన పన్ను మొత్తం రూ.25వేలు దాటితే రిటర్నులు వేయాల్సిందే.
* విదేశీ ప్రయాణాల కోసం రూ.2లక్షలకు మించి ఖర్చు చేసినప్పుడు ఐటీఆర్‌ తప్పనిసరి. పన్ను చెల్లింపుదారుడు, అతని/ఆమె కుటుంబ సభ్యులు చేసిన విదేశీ ప్రయాణాలనూ ఇక్కడ చూపించాల్సి వస్తుంది.
* ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి విద్యుత్‌ బిల్లు చెల్లించిన సందర్భంలో రిటర్నులు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు