Agriculture Sector: వ్యవసాయమే ఆదుకుంది

‘వ్యవసాయం భారత దేశానికి పునాది. ఈ రంగం ఇచ్చిన ఊతం వల్లే 2021-22లో ఆర్థిక పునరుత్థానం వేగం పుంజుకొంది’.. దేశంలోని పరిస్థితులపై విడుదల చేసిన నెలవారీ విశ్లేషణ నివేదికలో ఆర్థిక శాఖ అభిప్రాయం ఇది. వాతావరణం అనుకూలించడంతో

Updated : 12 Dec 2021 09:21 IST

నెలవారీ విశ్లేషణలో ఆర్థికశాఖ
అన్ని రంగాలూ పుంజుకుంటున్నట్లు వెల్లడి

ఈనాడు, దిల్లీ: ‘వ్యవసాయం భారత దేశానికి పునాది. ఈ రంగం ఇచ్చిన ఊతం వల్లే 2021-22లో ఆర్థిక పునరుత్థానం వేగం పుంజుకొంది’.. దేశంలోని పరిస్థితులపై విడుదల చేసిన నెలవారీ విశ్లేషణ నివేదికలో ఆర్థిక శాఖ అభిప్రాయం ఇది. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం 4.5% వృద్ధిని నమోదు చేసింది. రబీలో నూనె గింజల సాగు క్రితం సారి కంటే 29.2% పెరిగింది. ఎరువుల విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ట్రాక్టర్‌ అమ్మకాలు గతేడాది కంటే 7% పెరిగాయి. 2021-22 ఖరీఫ్‌, రబీ పంటకు కనీస మద్దతు ధర వృద్ధి చెందింది. బియ్యం సేకరణ వల్ల 49 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తద్వారా గ్రామీణ ఆదాయం పెరిగింది.

అన్ని కొలమానాల్లోనూ పురోగతి: ప్రస్తుతం దేశ ఆర్థిక పురోగతి అన్ని కొలమానాల్లోనూ సానుకూలత కనిపిస్తోంది. మొత్తం 22 హైఫ్రీక్వెన్సీ సూచీల్లో 19 సూచీలు 2021 అక్టోబరు, నవంబరు నెలల్లో మహమ్మారి ముందునాటి (2019లో ఇదే నెలల్లో) పరిస్థితులను దాటేశాయి. ‘ఒమిక్రాన్‌’ ప్రపంచ ఆర్థిక పురోగతికి ముప్పుగా పరిణమించవచ్చనే ఆందోళన ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌ పెరిగే కొద్దీ కొత్త రకం వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చ’నే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెండో త్రైమాసిక వృద్ధిరేటు 8.4%: 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్‌ జీడీపీ 8.4% వృద్ధి రేటు సాధించింది. 2019-20 ఇదే త్రైమాసికంతో పోలిస్తే రికవరీ 100%కి మించి జరిగింది. వరుసగా నాలుగు త్రైమాసికాలు (2021 3, 4 త్రైమాసికాలు, 2022లో 1, 2 త్రైమాసికాలు) వృద్ధి నమోదుచేసిన దేశాల్లో భారత్‌ ఒకటి. సేవల రంగం పుంజుకోవడం, తయారీ రంగంలో పూర్తి రికవరీ కనిపించడం, వ్యవసాయ రంగంలో సుస్థిర వృద్ధి నమోదువల్లే ఇది సాధ్యమైంది.

మహమ్మారి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే..

ఎగుమతులు 17%, పెట్టుబడులు 1.5% పెరిగాయి.

తయారీ, నిర్మాణ రంగాలు కొవిడ్‌ ముందు స్థాయిని మించాయి.

ట్రేడ్‌, హోటల్‌, కమ్యూనికేషన్‌ సేవల స్థూల అదనపు విలువ మెరుగుపడింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 70%, 2వ త్రైమాసికం నాటికి 90% రికవరీ సాధించాయి.

బొగ్గు, సిమెంట్‌, సహజవాయువుల వినియోగం పెరిగింది.

దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఒక్క నవంబరులోనే రూ.30వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు.

ఈ ఏడాది తొలి 6నెలల్లోనే ఎఫ్‌డీఐలు 20 బి.డాలర్లను మించాయి.

విదేశీ మారకద్రవ్య నిల్వలు 640.4 బిలియన్‌ డాలర్లకు చేరి సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాయి.

చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించడం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించింది.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మెరుగుదల నమోదుకావడం వల్ల ఆదాయాలు స్థిరంగా పెరుగుతున్నాయి.

‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మౌలికవసతులపై ప్రభుత్వ వ్యయం 28.3% పెరిగింది. ఇదే సమయంలో రెవిన్యూ వ్యయం వృద్ధిరేటూ తగ్గింది. ఇది ప్రభుత్వ వ్యయంలో నాణ్యత పెరిగిందనడానికి అద్దం పడుతోంది’’ అని ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని