Indigo-Jet Airways: ప్రయాణికుడితో వాగ్వివాదం.. ఇండిగో సిబ్బందికి జెట్ఎయిర్‌వేస్‌ సీఈవో మద్దతు!

ఫ్లైట్‌లో ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న ఘటనలో సిబ్బందికి మరో విమానయాన సంస్థ సీఈవో మద్దతుగా ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. 

Published : 21 Dec 2022 22:21 IST

దిల్లీ: విమానం ఆలస్యం అయిందనో.. సిబ్బంది తీరు సరిగా లేదనో.. పలు సందర్భాల్లో విమానయాన సంస్థలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కొన్నిసార్లు విమానం గాల్లో ఉన్నప్పుడే ప్రయాణికులు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంటుంది. ఇలాంటి సందర్బాల్లో విమానయాన సంస్థలు సిబ్బంది తీరునే తప్పుబడతాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఒక విమానయాన సంస్థ సిబ్బందికి మరో విమానయాన సంస్థ సీఈవో మద్దతు పలికిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఫ్లైట్‌ సిబ్బంది కూడా మనుషులే అనే విషయాన్ని గుర్తించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఈ నెల 16న ఇస్తాంబుల్‌ నుంచి దిల్లీకి వస్తోన్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. తాను కోరిన ఆహారం అందించలేదని ఎయిర్‌హోస్టెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దానికి ప్రతిగా ఎయిర్‌హోస్టెస్‌ సైతం ధీటుగా బదులిస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. ‘‘ మీరు వేలు చూపుతూ మాపై ఎందుకు అరుస్తున్నారు. మీ వల్ల మా సిబ్బంది బాధపడుతున్నారు. టికెట్‌లో మీరు అందించిన వివరాల ప్రకారమే మీకు ఆహారం అందిస్తున్నాం’’ అని ఎయిర్‌హోస్టెస్‌ చెప్పేందుకు ప్రయత్నిస్తుండంగా.. ప్రయాణికుడు ‘‘నాపై ఎందుకు అరుస్తున్నారు? మీరు సర్వెంట్లు’’ అని అనడంతో.. ‘‘నేను మీకు సర్వెంట్‌ కాదు. ఉద్యోగిని. మాతో మీరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు’’ అని బదులిచ్చినట్టుగా వీడియోలో రికార్డయింది. ఇంతలో మరో ఎయిర్‌హోస్టెస్‌ వచ్చి అక్కడి నుంచి ఆమెను పక్కకు తీసుకెళ్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని విమానంలోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

 ఈ వీడియోపై జెయిర్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ నేను గతంలో చెప్పినట్లు విమానసిబ్బంది కూడా మనుషులే. ఆమెను ఎంతో ఆవేదనకు గురిచేస్తే తప్ప ఇలా వ్యవహరించదు. విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడి చేయడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆమెను సర్వెంట్ అని పిలవడం దారుణం. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని భావిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. సంజీవ్‌ కపూర్‌ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎయిర్‌హోస్టెస్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని