NFT: 1.7 మి.డాలర్ల ఎన్‌ఎఫ్‌టీలు దొంగిలించిన హ్యాకర్లు!

ప్రపంచంలో అతిపెద్ద నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ (NFT) మార్కెట్‌ప్లేస్ అయిన ‘ఓపెన్‌సీ (OpenSea)’ హ్యాకింగ్‌కు గురైంది....

Published : 20 Feb 2022 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అతిపెద్ద నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ (NFT) మార్కెట్‌ప్లేస్ అయిన ‘ఓపెన్‌సీ (OpenSea)’ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో దాదాపు 32 మంది యూజర్లు తమ ఖాతాల నుంచి 1.7 మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎన్‌ఎఫ్‌టీలు కోల్పోయినట్లు ఓపెన్‌సీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ డెవిన్‌ ఫింజర్‌ ప్రకటించారు. 200 మిలియన్ డాలర్ల ఎన్‌ఎఫ్‌టీలు పోయినట్లు వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. దొంగిలించిన ఎన్ఎఫ్‌టీలను విక్రయించడం ద్వారా దుండగుల ఖాతాలో 1.7 మిలియన్ డాలర్లు జమ అయినట్లు గుర్తించామన్నారు.

ఈ హ్యాకింగ్‌ తీవ్రత, నష్టాన్ని ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ప్లేస్ ఇంకా అంచనా వేయాల్సి ఉంది. యూజర్ల ఇ-మెయిల్‌ ఐడీ వంటి వివరాలు లీక్‌ అవ్వడం వల్లే ఈ సైబర్‌ దాడి జరిగి ఉంటుందని ప్రముఖ బ్లాక్‌చైన్ ఇన్వెస్టిగేటర్‌ పెక్‌షీల్డ్‌ అంచనా వేశారు. తమ ప్లాట్‌ఫామ్‌పై క్రియాశీలకంగా లేని ఎన్‌ఎఫ్‌టీలను డీలిస్ట్‌ చేసేందుకుగానూ స్మార్ట్‌ కాంట్రాక్ట్‌ను మరోవారంలో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ఓపెన్‌సీ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపట్లోనే హ్యాకింగ్‌ వెలుగులోకి రావడం గమనార్హం. స్మార్ట్‌ కాంట్రాక్ట్‌ అప్‌గ్రేడ్ వల్ల లిస్టెడ్‌ ఎన్‌ఎఫ్‌టీలను ఇథేరియం బ్లాక్‌చైన్‌ నుంచి కొత్త స్మార్ట్‌ కాంట్రాక్ట్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.

1.9 మిలియన్‌ డాలర్ల అవినీతి కేసులో భాగంగా యూకే ప్రభుత్వ పన్నుల విభాగం ఇటీవల మూడు ఎన్‌ఎఫ్‌టీలను స్వాధీనం చేసుకుంది. అలాగే 6,762 డాలర్లు విలువ చేసే క్రిప్టో ఆస్తుల్ని కూడా స్వాధీనపర్చుకొంది. ఈ తరుణంలో హ్యాకింగ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని