IT Returns: ఐటీ రిటర్నులు సమర్పించారా? గడువులోగా దాఖలు చేయకుంటే..?

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులంతా తమ పన్ను రిటర్నులను జులై 31వ తేదీలోగా సమర్పించాలి.

Updated : 06 Jul 2022 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులంతా తమ పన్ను రిటర్నులను జులై 31వ తేదీలోగా సమర్పించాలి. ఒకవేళ గడువు దాటితే పన్ను చెల్లింపుదారులు అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. మరి ఈ జరిమానా ఎలా ఉంటుంది..? రిటర్నులు ఎలా ఫైల్‌ చేసుకోవాలి?

వ్యక్తులు, వేతనజీవులు ఈ నెలాఖరులోగా..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులను బట్టి రిటర్నులు సమర్పించేందుకు గడువు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. అంటే.. వ్యక్తులు, వేతన జీవులు (వీరి ఖాతాలను ఆడిట్‌ చేయాల్సిన అవసరం లేదు) జులై 31లోగా రిటర్నులు దాఖలు చేయాలి. ఇక, హిందూ అవిభాజ్య కుటుంబాలు (Hindu Undivided Families HUF) కూడా జులై 31నే రిటర్నులు సమర్పించాలి. వీరి ఆదాయ ఖాతాలను కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది వీరే.

కంపెనీలకు మరింత గడువు

కంపెనీలు, సంస్థల్లో పనిచేసే భాగస్వాముల వంటి పన్ను చెల్లింపుదారుల ఆదాయపు ఖాతాలను ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఐటీ రిటర్నులు సమర్పిచేందుకు మరింత గడువు కల్పిస్తారు. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు గడువు ఉంది. ఇక, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ లావాదేవీలు జరిపిన వారు సెక్షన్‌ 92ఈ కింద ఆ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ ఏడాది నవంబరు 30 వరకు గడువు ఉంది.

(ఇదీ చదవండి: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..)

గడువు దాటితే..

ఏదైనా కారణాలతో గడువులోపు రిటర్నులు దాఖలు చేయలేనివారికి మరో అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం వారు కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అపరాధ రుసుముతో కలిపి డిసెంబరు 31 వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.

* పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల పైన ఉన్నప్పుడు ఈ జరిమానా మొత్తం రూ. 5000

పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉంటే.. ఈ అపరాధ రుసుము రూ.1000

* దీనికి అదనంగా.. పన్ను చెల్లింపుదారులు సెక్షన్‌ 234ఏ కింద వడ్డీ పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్‌ చేయాలంటే..

* ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. https://www.incometax.gov.in/iec/foportal ఈ లింక్ ద్వారా నేరుగా వెబ్‌సైట్లోకి వెళ్లొచ్చు.

* మీ పాన్ నంబ‌రును ఉప‌యోగించి లాగిన్ అవ్వాలి.

* ఈ-ఫైల్‌ను క్లిక్ చేసి ‘అసెస్మెంట్ సంవ‌త్స‌రం 2022-23’ ఎంపిక చేసుకోవాలి.

* మీ వార్షిక ఆదాయం, స్టేట‌స్‌, ఇత‌ర వివ‌రాల‌ ఆధారంగా మీకు స‌రిపోయే ‘ఐటీఆర్-1’ లేదా ‘ఐటీఆర్-4’ ఫారంను ఎంపిక చేసుకోవాలి.

* రిట‌ర్నులు దాఖ‌లు చేయడానికి గ‌ల కార‌ణాన్ని ఎంపిక చేసుకుని ఫారంలో ముందుగానే నింపి ఉన్న స‌మాచారాన్ని ధ్రువీకరించండి.

* ఆ త‌ర్వాత సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి మీ ఐటీఆర్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.

* మీ వివరాలను నిర్ధారించుకుని, వెరిఫై అండ్ స‌బ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నిమిషాల స‌మ‌యం పడుతుంది. ఐటీఆర్ దాఖ‌లు చేసిన వెంట‌నే ఈ-వెరిఫికేష‌న్ కూడా పూర్తి చేయవ‌చ్చు. లేదా ఐటీఆర్ దాఖలు చేసిన త‌ర్వాత 120 రోజుల‌లోపు ఈ-వెరిఫికేష‌న్ చేయ‌వ‌చ్చు. ట్యాక్స్ పెయిడ్ అండ్ వెరిఫికేష‌న్ ట్యాబ్‌ను క్లిక్ చేసి మీరు ఏ విధానంలో ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేయాల‌నుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని