Lava: లావా నుంచి అగ్ని2 5జీ.. కార్డుతో కొనుగోళ్లపై ₹2వేల డిస్కౌంట్‌!

Lava Agni 2 5G: లావా నుంచి చాలా రోజుల తర్వాత అగ్ని2 5జీ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. దీని ధర రూ.21,999. మే 24 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Published : 16 May 2023 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా చాలా రోజుల తర్వాత మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అగ్ని 2 5జీ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 2021 ఆఖర్లో తీసుకొచ్చిన అగ్ని ఫోన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను విడుదల చేసింది. కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాడ్‌ కెమెరా, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు. ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాల్లోకి వెళదాం పదండి..

లావా అగ్ని 2 5జీ ఫోన్‌.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌లో వస్తోంది. ఒకే ఒక్క రంగులో లభిస్తుంది. దీని ధరను రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌లో మే 24 ఉదయం 10 గంటల నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రధాన బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుతో కొనుగోలు జరిపినా రూ.2000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అంటే ఫోన్‌ రూ.19,999,కే లభించనుందన్నమాట.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. వెనుకవైపు 3డీ గ్లాస్‌ డిజైన్‌, మ్యాటీ ఫినిష్‌తో వస్తోంది. ఇందులో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డిమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. దేశీయంగా ఈ ప్రాసెసర్‌ను వాడిన తొలి కంపెనీ లావానే. వెనుక వైపు 50 ప్రధాన కెమెరా వాడారు. మిగిలిన మూడింటిలో 8+2+2 ఎంపీ కెమెరాను అమర్చారు. వర్చువల్‌ ర్యామ్‌ను 16జీబీ వరకు వాడుకోవచ్చు. 

ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 13తో వస్తోంది. ఇందులో ఎలాంటి బ్లోట్‌ వేర్‌ ఉండబోదని కంపెనీ పేర్కొంటోంది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్‌ 15 అప్‌డేట్స్‌తో పాటు మూడేళ్ల పాటు క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 0-50 శాతం బ్యాటరీ కేవలం 16 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుందని కంపెనీ పేర్కొంది. మొత్తం 13 5జీ బ్యాండ్లకు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని