LIC Investments: అదానీ ఎఫెక్ట్‌.. ఎల్‌ఐసీ పెట్టుబడులపై పరిమితి!

LIC- Adani group: ఎల్‌ఐసీ తన పెట్టుబడులపై పరిమితి విధించాలనుకుంటోంది. ఈ మేరకు బోర్డులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Published : 25 Mar 2023 13:21 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group) వ్యవహారంలో ఎల్‌ఐసీపై (LIC) విమర్శలు వచ్చిన వేళ ఆ సంస్థ అప్రమత్తమైంది. రుణ, ఈక్విటీ పెట్టుబడులపై పరిమితి విధించాలని యోచిస్తోంది. దీనిపై త్వరలో బోర్డులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చి సంస్థ వెలువరించిన నివేదికతో అదానీ షేర్లు భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ గ్రూప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ సైతం భారీగా తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్‌ఐసీపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సంస్థలు, గ్రూప్‌ కంపెనీలు, ఒకే ప్రమోటర్‌ కలిగిన కంపెనీలకు ఇచ్చే రుణ, ఈక్విటీ పెట్టుబడులపై పరిమితి విధించాలని ఎల్‌ఐసీ యోచిస్తోందని తెలిసింది. ఆ కంపెనీ మొత్తం ఈక్విటీల్లో 10 శాతం, రుణాల్లో 10 శాతం వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం వీలుంది. అయితే, ఈ పెట్టుబడులపైనా ఓ పరిమితి విధించుకోవాలని ఎల్‌ఐసీ భావిస్తోంది. ఎంత శాతమనేది బోర్డులో నిర్ణయించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ 30వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. దాదాపు రూ.6 వేల కోట్లు మేర రుణాలు ఇచ్చింది. పరిమితి విధించే అంశంపై అటు ఎల్‌ఐసీ గానీ, ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని