LIC IPO: ఎల్‌ఐసీ లాభం రూ.234 కోట్లు.. త్వరలో సెబీకి తుది ముసాయిదా పత్రాలు!

త్వరలో ఐపీఓకి రానున్న ఎల్‌ఐసీ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో రూ.234.91 నికర లాభాల్ని నివేదించింది....

Published : 11 Mar 2022 19:18 IST

ముంబయి: త్వరలో ఐపీఓకి రానున్న ఎల్‌ఐసీ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో రూ.234.91కోట్ల నికర లాభాల్ని నివేదించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో సంస్థ నికర లాభాలు రూ.0.91 కోట్లుగా నమోదయ్యాయి. ఐపీఓకి వెళ్లే క్రమంలో సంస్థ నిబంధనల్లో పలు మార్పులు చేశారు. అందులో భాగంగా సర్‌ప్లస్‌ డిస్ట్రిబ్యూషన్‌ మోడల్‌ను సవరించారు. ఈ నేపథ్యంలో నికర లాభాలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఇక ఏప్రిల్-డిసెంబరు మధ్య 9 నెలల వ్యవధిలో సంస్థ నికర లాభం రూ.1,642.78 కోట్లుగా నమోదైంది.

గతంలో ఎల్‌ఐసీలో ఒకే ‘లైఫ్‌ ఫండ్‌’ ఉండేది. ఐపీఓ నేపథ్యంలో సెక్షన్‌ 24లో పలు సవరణలు చేశారు. దీంతో సంస్థ సర్‌ప్లస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రక్రియను ప్రైవేటు బీమా సంస్థలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇప్పుడు లైఫ్ ఫండ్‌ను రెండుగా విభజించారు. అందులో ఒకటి పార్టిసిపేటింగ్‌ పాలసీహోల్డర్స్‌ ఫండ్‌ అయితే.. మరొకటి నాన్‌-పార్టిసిపేటింగ్‌ పాలసీహోల్డర్స్‌ ఫండ్‌. ఈ క్రమంలో పార్టిసిపేటింగ్‌ పాలసీ హోల్డర్ల ఫండ్‌లో సర్‌ప్లస్‌ డిస్ట్రిబ్యూషన్‌ను దశలవారీగా 90:10కు మార్చారు. ఫలితంగా 90 శాతం నిధులు పాలసీ హోల్డర్లకు, 10 శాతం షేర్‌ హోల్డర్లకు వెళతాయి. ఇక నాన్‌-పార్టిసిపేటింగ్‌ వ్యాపారం నుంచి వచ్చే నిధుల్లో 100 శాతం అందరు షేర్‌హోల్డర్లకు పంపిణీ చేస్తారు.

ఈ మార్పుల వల్ల సంస్థ లాభదాయకత పెరుగుతుందని ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు. ఒకసారి స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన తర్వాత మదుపర్ల దృష్టంతా దీనిపైనే ఉండనుంది. ఇక మూడో త్రైమాసికంలో వసూలైన ప్రీమియంల విలువ 0.8 శాతం పెరిగి రూ.97,761 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో ప్రీమియంల మొత్తం విలువ 1.67శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరింది.

క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్న, క్రియాశీలక పాలసీహోల్డర్ల సంఖ్యను సూచించే ‘పర్సిస్టెన్సీ రేషియో’ గత త్రైమాసికంలో 69.23శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 72.98 శాతంగా ఉంది. ఇక రుణ షరతులు, ఇతర ఆర్థిక నిబంధనలకు కట్టుబడి ఉండే సామర్థ్యాన్ని సూచించే సాల్వెన్సీ రేషియో 1.64 నుంచి 1.77కి పెరిగింది. సెబీ నియమాల ప్రకారం.. ఇది కనీసం 1.5గా ఉండాలి. నిరర్ధక ఆస్తుల నిష్పత్తి సైతం మెరుగుపడి 7.78 శాతం నుంచి 6.32 శాతానికి చేరింది.

త్వరలో సెబీకి తుది ముసాయిదా పత్రాలు...

ఎల్‌ఐసీ ఐపీఓకి ఇటీవలే సెబీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న సంస్థ ప్రాథమిక పత్రాలు సమర్పించగా.. కేవలం 22 రోజుల్లోనే ఆమోదం తెలిపింది. త్వరలో తుది ముసాయిదా పత్రాలు సైతం సమర్పించే యోచనలో ఎల్‌ఐసీ ఉన్నట్లు సమాచారం. దీంట్లో ధరల శ్రేణి, పాలసీహోల్డర్లకు రాయితీ, వివిధ వర్గాలకు కేటాయించే షేర్ల వాటా వంటి వివరాలు ఇందులో ఉండనున్నాయి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఐపీఓకి వెళ్లడానికి ప్రభుత్వం మరికొంత కాలం వేచి చూసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని