4 day work week: నాలుగు రోజుల పనికే ఓటు.. సర్వేలో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా వారంలో 4 రోజుల పని దినాల గురించి చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ పని విధానం అమలౌతుండగా.. మరికొన్ని దేశాల్లో ఈ పనివిధానాన్ని అందిపుచ్చుకోవడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

Published : 09 Apr 2022 22:45 IST

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా వారంలో 4 రోజుల పని దినాల గురించి చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ పని విధానం అమలౌతుండగా.. మరికొన్ని దేశాల్లో ఈ పనివిధానాన్ని అందిపుచ్చుకోవడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనియస్‌ కన్సల్టెంట్‌ అనే సంస్థ మన దేశంలో ఓ సర్వే నిర్వహించింది. 4 రోజుల పనివిధానం గురించి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో మెజారిటీ సభ్యులు 4 రోజుల పని విధానానికి జై కొట్టారు. దీనివల్ల ఇటు వృత్తి జీవితానికి, అటు వ్యక్తిగత జీవితానికి న్యాయం చేయడానికి వీలుపడుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఒత్తిడిని అధిగమించేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహించినట్లు జీనియస్‌ కన్సల్టెంట్‌ సంస్థ తెలిపింది. 1113 మంది యజమానులు, ఉద్యోగులు ఈ సర్వేలో భాగమైనట్లు పేర్కొంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కన్సస్ట్రక్షన్‌, ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌, ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, ఐటీ, బీపీఓ, మానుఫాక్చరింగ్‌, మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌.. ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు సర్వేలో పాల్గొన్నట్లు పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న ఉద్యోగులందరూ 4 రోజుల పనికి ఓకే చెప్పడం గమనార్హం. అయితే, ఒకరోజు అదనపు సెలవు కోసం 12 గంటలకు మించి పనిచేయడానికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు 56 శాతం మంది సత్వరమే అంగీకారం తెలపగా.. 44 శాతం మంది మాత్రం సాధారణ పనిగంటలకు మించి పనిచేయడానికి సుముఖంగా లేమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న అందరిలో 66 శాతం మంది వారానికి 4 రోజుల పనిదినాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల తమ ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తంచేసినట్లు సర్వే తెలిపింది. ఒకవేళ 4 రోజులు పని విధానం అమలైతే ఆ మూడో సెలవు శుక్రవారమైతేనే బాగుంటుందని సగం మందికి పైగా వ్యక్తులు అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని