Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opens: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 18 పాయింట్లు లాభపడి 19,693 దగ్గర కొనసాగుతోంది.

Updated : 26 Sep 2023 09:46 IST

Stock Market Opens | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 18 పాయింట్లు లాభపడి 19,693 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.19 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు (Stock Market) నష్టాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్‌ మదుపర్ల ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డీమ్యాట్‌ ఖాతాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఆగస్టులో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 26 శాతం పెరిగి, మొత్తమ్మీద 12.7 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటు అంచనాల్లో ఎలాంటి మార్పు చేయకుండా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్లు సోమవారం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) సోమవారం రూ.2,333.03 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.1,579.28 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

సాయంత్రం 6 నుంచి 9 దాకా ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

  • పూనావాలా ఫిన్‌కార్ప్‌: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌తో కలిసి కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును జారీ చేసేందుకు పూనావాలా ఫిన్‌కార్ప్‌కు ఆర్‌బీఐ అనుమతి లభించింది.
  • బ్యాంకింగ్ స్టాక్స్‌: పట్టణ ప్రాంతాల్లో చిన్న మొత్తాల గృహ రుణాలకు వడ్డీ సబ్సిడీని అందించే నిమిత్తం రూ.60,000 కోట్లు(7.2 బిలియన్‌ డాలర్లు) వెచ్చించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం వెల్లడించింది. రాబోయే రెండు నెలల్లో ఈ పథకాన్ని బ్యాంకులు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంది.
  • ఎంఅండ్‌ఎం: కెనడాకు చెందిన ఓంటారియో.. మహీంద్రా టెకోలో 20 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని విలువ రూ.35 కోట్లు.
  • విప్రో: చెన్నైలో ఓ ల్యాండ్‌ పార్సెల్‌ను విక్రయించడం ద్వారా విప్రో రూ.266.38 కోట్లు సమీకరించింది.
  • శీలా ఫోమ్‌: క్యూఐపీ జారీ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించేందుకు శీలా ఫోమ్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
  • ఇండియన్‌ హోటల్స్‌: నెదర్లాండ్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న అనుబంధ సంస్థ IHOCO BVలో 11.5 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని ఇండియన్‌ హోటల్స్‌ నిర్ణయించింది.
  • ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌: ఆర్టిస్టెరీ ప్రాపర్టీస్‌లో రూ.32 కోట్లతో 99.9 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్ నిర్ణయించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని