Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ

Stock Market Opens: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 312 పాయింట్ల నష్టంతో 65,516 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు నష్టపోయి 19,533 దగ్గర కొనసాగుతోంది.

Published : 03 Oct 2023 09:41 IST

Stock Market Opens | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 312 పాయింట్ల నష్టంతో 65,516 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు కుంగి 19,533 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగి 83.21 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గాంధీ జయంతి నేపథ్యంలో సోమవారం భారత మార్కెట్లు (Stock Market) పనిచేయలేదు. అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నెల 6న వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించొచ్చనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై వ్యాఖ్యలు సూచీలపై ప్రభావం చూపొచ్చు. 7న జీఎస్‌టీ మండలి సమావేశంపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పన్నులపై జీఎస్‌టీ మండలి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తయారీ, సేవల పీఎంఐ, రుణాల వృద్ధి గణాంకాలపై మదుపర్లు ఈవారం దృష్టి సారించే అవకాశం ఉంది. పండగల సీజన్‌ ప్రారంభం కావడంతో వినియోగ, ఆతిథ్య రంగ షేర్లు వెలుగులీనొచ్చని నిపుణులు అంచనా వేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.1,685.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,751.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

వైభవ్‌ జ్యువెలర్స్‌: ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఆభరణాల విక్రయాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైభవ్‌ జ్యువెలర్స్‌ షేర్లు నేడు ఎక్స్ఛేంజీల్లో అడుగుపెట్టనున్నాయి.

అరబిందో ఫార్మా: అరబిందో ఫార్మాకు చెందిన ఏపీఐ నాన్‌-యాంటీబయాటిక్‌ వ్యాపారం, ఏపీఐ యాంటీబయాటిక్‌ వ్యాపారం అపిటోరియా ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు బదిలీ అయ్యాయి. ఈ సంస్థ, అరబిందో ఫార్మాకు సబ్సిడరీ కావడం గమనార్హం.

వేదాంతా: అల్యూమినియం, చమురు-గ్యాస్‌, ఉక్కు సహా అయిదు కీలక వ్యాపారాలను విడదీసి ప్రత్యేక నమోదిత సంస్థలుగా ఏర్పాటు చేయనున్నట్లు అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా శుక్రవారం వెల్లడించింది. వాటాదార్లకు విలువ సృష్టించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఫెడరల్‌ బ్యాంక్‌: ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ రుణాలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం పెరిగింది. అదే సమయంలో డిపాజిట్లలో 23 శాతం వృద్ధి నమోదైంది.

కోల్‌ ఇండియా: సెప్టెంబరు నెలలో కోల్‌ ఇండియా ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి 51.4 మిలియన్ టన్నులుకు చేరింది.

ఆస్ట్రా మైక్రోవేవ్‌: ఆస్ట్రా మైక్రోవేవ్‌కు చెందిన సంయుక్త సంస్థ అయిన ఆస్ట్రా రఫేల్‌ కామ్‌సన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు భారత వాయుసేన నుంచి రూ.96.49 కోట్ల ఆర్డర్లు లభించాయి.

వాహన స్టాక్స్‌: దేశీయంగా ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు గత నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. పండుగ సీజన్‌లో గిరాకీకి తగ్గట్లు వాహన తయారీ సంస్థలు డీలర్లకు సరఫరా పెంచడం కలిసొచ్చింది. సెప్టెంబరులో పరిశ్రమ స్థాయిలో మొత్తం 3,63,733 వాహనాలు డీలర్లకు సరఫరా అయ్యాయి. ఒకే నెలలో ఈ స్థాయిలో డిస్పాచ్‌లు కావడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని