Maruti Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ వచ్చేసింది.. ధరెంతో తెలుసా?

Maruti Jimny: మారుతీ సుజుకీ తమ జిమ్నీ ఎస్‌యూవీని ఈరోజు విడుదల చేసింది. దీని ధరల శ్రేణిని కూడా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే ఇవి కస్టమర్లకు అందుబాటులో రానున్నాయి.

Published : 07 Jun 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహన ప్రియులను గతకొంతకాలంగా ఉత్కంఠకు గురిచేసిన మారుతీ సుజుకీ జిమ్నీ (Maruti Suzuki Jimny) ఎట్టకేలకు విడుదలైంది. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ఆవిష్కరించినప్పటి నుంచి దీని విడుదలపై అనేక మంది ఆసక్తిగా వేచిచూస్తున్నారు. బుకింగ్స్‌ గతంలోనే ప్రారంభమవగా.. ఇప్పటి వరకు 30 వేల ఆర్డర్లు లభించాయి. ధరల శ్రేణి రూ.12.74లక్షలు- రూ.15.05 లక్షలు. జూన్‌ మధ్య నుంచి కస్టమర్లకు ఈ కార్లను డెలివరీ చేస్తారని డీలర్లు చెప్పారు.

జిమ్నీ ఇంజిన్‌, స్పెసిఫికేషన్లు..

1.5 లీటర్‌, 4- సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ (Maruti Suzuki Jimny) 105 హెచ్‌పీ శక్తిని, 134ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 5- స్పీడ్‌ మాన్యువల్‌, 4- స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను పొందుపర్చారు. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌కు 16.94 కి.మీ, అదే ఆటోమేటిక్ వేరియంట్‌ లీటర్‌కు 16.39 కి.మీ మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 5 డోర్లతో వస్తున్న ఈ కారుకు 210ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంది. అల్ఫా, జెటా అనే రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

జిమ్నీ ఫీచర్లు..

జిమ్నీ (Maruti Suzuki Jimny) అల్ఫా ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, కీలెస్‌ ఎంట్రీ, వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్‌-హోల్డ్‌ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లను అన్ని ట్రిమ్‌లలో ఇస్తున్నారు. మొత్తం ఏడు రంగుల్లో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. ఐదు డోర్లు ఇస్తున్నప్పటికీ.. ఇది ఫోర్‌- సీటర్‌ వాహనం కావడం గమనార్హం. మహీంద్రా థార్‌, ఫోర్స్‌ గూర్ఖాకు ఇది పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని