Mercedes-Benz: బెంజ్‌ కార్లు మరింత ప్రియం.. ఈ ఏడాదిలో రెండోసారి పెంపు

Mercedes-Benz price rise: దేశంలో బెంజ్‌ కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి మోడల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ప్రియం కానున్నాయి.

Published : 09 Mar 2023 17:33 IST

దిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes-Benz) ఇండియా మరోసారి కార్ల ధరలు (Price Hike) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. విదేశీ మారక ద్రవ్యం ప్రభావంతో పెరిగిన ఇన్‌పుట్‌ కాస్ట్‌ను భర్తీ చేసుకునేందుకు ధరల పెంపును ప్రకటిస్తున్నట్లు బెంజ్‌ తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

గత కొన్ని నెలలుగా యూరోతో రూపాయి విలువ భారీగా క్షీణిస్తూ వస్తోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. ఒకప్పుడు యూరోతో రూపాయి విలువ 78-79గా ఉండేదని, ఇప్పుడు 87కి చేరిందని చెప్పారు. దీనివల్ల కంపెనీపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రూపాయితో పాటు లాజిస్టిక్స్‌ వంటి ఇతర ఖర్చులూ పెరిగాయని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయకుంటే.. భారత్‌లోని తమ మొత్తం వ్యాపారంపై ప్రభావం పడుతుందన్నారు.

మెర్సిడెస్‌ బెంజ్‌ తాజా నిర్ణయంతో ఏప్రిల్‌ 1 నుంచి ఏ క్లాస్‌ లిమోసిన్‌ ధర రూ.2 లక్షల మేర పెరగనుంది. జీఎల్‌ఏ ఎస్‌యూవీ, ఎస్‌ 350డి లిమోసిన్‌ మోడళ్లు రూ.7 లక్షల మేర పెరగనున్నాయి. మెర్సిడెస్‌కు చెందిన టాప్‌ మోడల్‌ మేబ్యాక్‌ ఎస్‌ 580 ఏకంగా రూ.12 లక్షలు పెరగనుంది. ఈ ఏడాది జనవరిలోనూ బెంజ్‌ తన కార్లపై 5 శాతం మేర ధరలు పెంచింది. 2022లో మొత్తం 15,822 యూనిట్లను భారత్‌లో బెంజ్‌ విక్రయించింది. 2021లో 11,242 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే 41 శాతం మేర విక్రయాలు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు