AI: మస్క్‌ ఆరోపణలు హాస్యాస్పదం.. ఏఐపై మెటా!

ఏఐ (AI) సాంకేతికత పైలట్‌ లేని విమానం వంటిదని, అణుబాంబుతో సమానమని, మానవ ఉనికిని నాశనం చేయగలదన్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆరోపణలను మెటా ఏఐ సీనియర్ సైంటిస్ట్‌ యాన్‌ లీకన్‌ (Yann LeCun) కొట్టిపారేశారు,. 

Published : 30 May 2023 19:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI)తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీలతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని మస్క్‌ సహా పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఓ లేఖ రాశారు. ఏఐ సాంకేతికత పైలట్‌ లేని విమానం వంటిదని, అణుబాంబుతో సమానమని, మానవ ఉనికిని నాశనం చేయగలదని గతంలో మస్క్‌ ఆరోపించారు. కానీ, మస్క్‌ వ్యాఖ్యలను మెటా శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆయన అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మెటాలో ఏఐపై పరిశోధనలు చేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త యాన్‌ లీకన్‌ (Yann LeCun) అన్నారు.

‘‘ఏఐతో మానవ మనుగడకు ముప్పు ఉందనేది కేవలం అపోహ మాత్రమే. మస్క్‌ వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. మానవులు ఏఐ సిస్టమ్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అది మరింత తెలివిగా వారితో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన వ్యవస్థను మనమే అభివృద్ధి చేస్తాం. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను నాశనం చేయాలంటే అది కొన్ని వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలానే అపరిమిత శక్తి అవసరమవుతుంది. ఇలా జరుగుతుందనుకోవడం పూర్తిగా హాస్యాస్పదం. ఏఐ కేవలం ఒక తెలివైన సాంకేతికత మాత్రమే. అది మానవులను నియంత్రిస్తుందనుకోవడం అర్థంలేని ఆలోచన’’ అని లీకున్‌ తెలిపారు. 

చాట్‌జీపీటీ అభివృద్ధి దశలో ఉన్న సమయంలో ఓపెన్‌ఏఐ (OpenAi) సంస్థలో ఎలాన్‌ మస్క్‌ సైతం పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఆయన వాటిని ఉపసంహరించుకున్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సాంకేతికతను మైక్రోసాఫ్ట్ బింగ్‌ సెర్చ్‌లో పరిచయం చేసింది. గూగుల్ సైతం బార్డ్‌ పేరుతో సొంత జీపీటీని అభివృద్ధి చేసింది. మరోవైపు గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్‌ గూగుల్‌ సంస్థలో తన పదవికి రాజీనామా చేశారు. ఏఐతో పొంచి ఉన్న ముప్పు గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాన్‌ లీకున్‌ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని