Meta: భారత్‌లో మెటా గ్లోబల్‌ బిజినెస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ టాటా క్లిక్‌ మాజీ సీఈఓ

వికాస్‌ పురోహిత్‌ గతంలో అమెజాన్‌, రిలయన్స్‌, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశారు. ఆయనను తాజాగా భారత్‌లో మెటా తమ గ్లోబల్‌ బిజినెస్‌ గ్రూప్‌ హెడ్‌గా నియమించింది. 

Published : 09 Jan 2023 20:23 IST

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక మెటా భారత్‌లో తమ గ్లోబల్‌ బిజినెస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌గా వికాస్‌ పురోహిత్‌ను నియమించింది. ఆయన గతంలో టాటా క్లిక్‌ సీఈఓగా పనిచేశారు. దేశంలో అగ్రగామి అడ్వర్టైజర్‌, ఏజెన్సీ పార్ట్‌నర్‌గా మెటాను తీర్చిదిద్దేందుకు సంబంధించిన ప్రణాళికను వికాస్‌ పురోహిత్‌ అమలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆయన దేశంలోని ప్రముఖ బ్రాండ్లు, ఏజెన్సీలతో వ్యూహాత్మక సంబంధాలను పర్యవేక్షించనున్నారు. తద్వారా భారత్‌లో మెటా ఆదాయ వృద్ధికి కృషి చేయనున్నారు.

వికాస్‌ పురోహిత్‌ ఐఐఎం బెంగళూరు పూర్వవిద్యార్థి. సేల్స్‌, మార్కెటింగ్‌ సహా సీనియర్‌ బిజినెస్‌ హోదాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టాటా క్లిక్‌, అమెజాన్‌, రిలయన్స్‌ బ్రాండ్స్‌, ఆదిత్య బిర్లా గ్రాప్‌, టామీ హిల్ఫిగర్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశారు. మెటాకు ముందు ఆయన టాటా క్లిక్‌లో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌తో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత టామీ హిల్ఫిగర్‌లో చేరారు. అనంతరం రిలయన్స్‌ బ్రాండ్స్‌లో రిటైల్‌ విభాగానికి నేతృత్వం వహించారు. అమెజాన్‌ ఫ్యాషన్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని