Twitter: ట్విటర్‌కు పోటీగా మెటా నుంచి కొత్త మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ..!

Meta works on Twitter like app: ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్‌ తీసుకొచ్చేందుకు మెటా పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ను పోలిన ఈ యాప్‌ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

Published : 20 May 2023 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను (Twitter) ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి అందులో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ట్విటర్‌లో పాలసీ పరమైన  నిబంధనలు మార్పులు కొందరికి రుచించడం లేదు. దీనిపట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌కు పోటీగా మాస్టోడాన్‌, ట్విటర్‌ మాజీ బాస్‌ జాక్‌ డోర్సీ బ్లూ స్కై వచ్చాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా సైతం ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి మెటా టెస్టింగ్‌ నిర్వహిస్తోందని తెలిసింది. సంబంధిత స్క్రీన్‌షాట్లు సైతం బయటకొచ్చాయి. ఈ యాప్‌నకు ఇంతవరకు పేరు పెట్టనప్పటికీ.. పీ92, బార్సిలోనా పేర్లతో ఇంటర్నల్‌గా పిలుచుకుంటున్నారు. ఇది సపరేట్‌ యాప్‌గానే ఉండబోతోందని, అయితే, ఇన్‌స్టా యూజర్లు తమ అకౌంట్‌తో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ యాప్‌ దాదాపు ఇన్‌స్టాను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఫొటోలు, వీడియోలతో కూడిన ఫీడ్‌ కాకుండా టెక్ట్స్‌ ఆధారిత టైమ్‌లైన్‌ పోస్టులు కనిపించనున్నాయి. అంటే ఇది అచ్చం ట్విటర్‌ను పోలి ఉండబోతోందన్నమాట. 500 అక్షరాల వరకు టెక్ట్స్‌ రాసుకోవడంతో పాటు ఫొటోలు, వీడియోలు సైతం యాడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని ఒక్క క్లిక్‌తో కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్ల బేస్‌ను సంపాదించుకున్న మెటా.. మరి కొత్త యాప్‌తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని