MG Comet: ఎంజీ కామెట్‌ ధరలొచ్చాయ్‌.. 3 ఏళ్ల తర్వాత 60% బైబ్యాక్‌ వాల్యూ!

MG Comet EV prices revealed: ఎంజీ కామెట్ విద్యుత్‌ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను కంపెనీ తాజాగా వెల్లడించింది. మే 15 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి.

Updated : 05 May 2023 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మోరిస్‌ గ్యారేజెస్‌ (MG) ఇండియా ఇటీవల విడుదల చేసిన కామెట్‌ విద్యుత్‌ కారుకు (Comet EV) పూర్తి ధరలను ప్రకటించింది. మొత్తం మూడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ.7.98 లక్షలుగా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు వేరియంట్‌ ధరలను ప్రకటించింది. బేస్‌ వేరియంట్‌ పేస్‌ (Pace) ధర రూ.7.98 లక్షలు కాగా.. ప్లే (Play) ధర రూ. 9.28 లక్షలు, ప్లష్‌ (Plush) ధర రూ.9.98 లక్షలు(ఎక్స్‌ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు తొలి 5 వేల బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

తక్కువ ధరలో విద్యుత్‌ కారును తీసుకొచ్చిన ఈ సంస్థ కామెట్‌ (MG Comet) వాహనంపై బైబ్యాక్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. మూడేళ్ల తర్వాత వాహనాన్ని వెనక్కిస్తే వాహన ఎక్స్‌షోరూమ్‌ ధరలో 60 శాతం సొమ్మును వెనక్కిస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు ఎంజీ ఇ-షీల్డ్‌ ఓనర్‌షిప్‌ ప్యాకేజీ కింద 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీ, మూడేళ్ల పాటు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, 3 ఫ్రీ లేబర్‌ సర్వీసెస్‌, 8 ఏళ్లు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారెంటీని కంపెనీ అందిస్తోంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 17.3kWh లిథియం ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్లు మేర ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. 0-100 శాతం ఛార్జింగ్‌కు 7 గంటల సమయం పడుతుంది. ఇందులో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం లేదు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.519 మాత్రమే అవుతుందని కంపెనీ చెబుతోంది. అర్బన్‌ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన కామెట్‌ బుకింగ్స్‌ మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మే నెలాఖరులో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని